MVV Satyanarayana: పవన్ కల్యాణ్‌పై ఎంవీవీ సత్యనారాయణ తీవ్ర విమర్శలు

  • పవన్ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు బూట్లు నాకుతున్నారన్న ఎంవీవీ
  • విశాఖను వదిలి వెళ్లిపోతానని తాను ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్య
  • తనను రాజీనామా చేయమనడానికి ఆయన ఎవరని ప్రశ్న
  • వీధి రౌడీకి, పవన్‌కు తేడా లేదని మండిపాటు
ysrcp mp mvv satyanarayana counters pawan kalyan

తనపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిప్పులు చెరిగారు. పవన్ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు బూట్లు నాకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తన పార్టీని చంద్రబాబుకు తాకట్టుపెట్టారని ఆరోపించారు. 

ఆదివారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్‌కు కనీస పరిజ్ఞానం లేదని, అసలు మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు. 
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎందుకు మాట్లాడరని పవన్‌ను ప్రశ్నించారు. విశాఖను ఏం చేయాలని అనుకుంటున్నారో పవన్ చెప్పాలని నిలదీశారు.
 
‘‘నా మాటలను పవన్ వక్రీకరించి చెప్పారు. నేను విశాఖ వదిలి వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదు. నన్ను రాజీనామా చేయమనడానికి ఆయన ఎవరు? పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఎంపీగా గెలిచిన నా గురించి మాట్లాడుతున్నారు” అని ఎంవీవీ ఎద్దేవా చేశారు. 

రాజకీయ నాయకుడి లక్షణం ఒక్కటి కూడా పవన్‌కు లేదని ఆయన మండిపడ్డారు. సినిమాల్లో గంతులేస్తే నాయకులు కాలేరని అన్నారు. వీధి రౌడీకి, పవన్‌కు తేడా లేదని విమర్శించారు. పవన్ కన్నా కేఏ పాల్ వెయ్యి రెట్లు బెటర్ అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మళ్లీ గాజువాకలో పోటీ చేయాలని, లేదా తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేకపోయారని అన్నారు.

More Telugu News