సోనియాగాంధే ఏం చేయలేకపోయింది.. జగన్‌ను నువ్వేం చేస్తావ్?: పవన్ పై రోజా ఫైర్

  • బ్రో సినిమాను ఆడించుకోలేకపోయాడు కానీ జగన్‌ను ఆడిస్తాడా? అని ఎద్దేవా
  • పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు.. అలాంటిది నువ్వేం చేస్తావని ఆగ్రహం
  • చంద్రబాబు చెప్పినట్లు మాట్లాడుతాడని విమర్శలు
  • జనసేన, ప్రజారాజ్యం వచ్చి 10, 15 ఏళ్లు అవుతున్నాయి కానీ చేసిందేం లేదని వ్యాఖ్య
బ్రో సినిమాను నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ అధినేత జగన్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ నిన్నటి మీటింగ్‌లో జగన్‌పై విమర్శలు చేశారని, అమిత్ షాకు చెప్పి జగన్‌ను ఆటాడిస్తానని చెబుతున్నాడని, కానీ తన సినిమాను ఆడించుకోలేక చతికిలపడ్డ జనసేనాని జగన్‌ను ఆడిస్తాడా? అని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఆడించడం... ఓడించడం దేశాన్నే గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదన్నారు.

ఈ రాజకీయ ఆటలో నువ్వు అరటిపండు.. అలాంటిది నువ్వేం చేస్తావని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పచ్చ ఛానళ్లు ఇచ్చే అబద్దాలు పవన్ మాట్లాడుతారన్నారు. సినిమాల్లో రీమేక్‌లు సక్సెస్ కావొచ్చునేమో.. కానీ రాజకీయాల్లో రీమేక్‌లు సక్సెస్ కావని విమర్శించారు. చంద్రబాబు మాట్లాడిందే పవన్ మాట్లాడుతారని, ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిందే చెబుతారన్నారు. జనసేనానికి ఓ జెండా, అజెండా లేవన్నారు.

ప్రజారాజ్యం, జనసేన పార్టీలు వచ్చి పదిపదిహేనేళ్లవుతున్నాయని, కానీ నమ్ముకున్న వారి కోసం ఇది చేశామని చెప్పే పరిస్థితి లేదన్నారు. పవన్ మాట్లాడితే చాలు చంద్రబాబుకు ఓటేయమన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. మీ తల్లిని, మీ కార్యకర్తలను, మీ జనసేన పిల్లసేనల్ని తిడితే కనీసం పట్టించుకోలేదని, కానీ ప్యాకేజీ కోసం లొంగుతారన్నారు. బాలకృష్ణ ఇంటర్వ్యూ కోసం వెళ్తారు... చంద్రబాబు ఇంటికి వెళ్తారు... టీడీపీకి ఓటు వేయమని చెబుతారు.. ఇదేనా రాజకీయం? అన్నారు. దత్తపుత్రుడు ఎలా తయారయ్యాడంటే మొరగమంటే మొరుగుతున్నాడు.. కరవమంటే కరుస్తున్నాడని విమర్శించారు. ఒక వింత జీవిలా తయారయ్యాడన్నారు.

Roja
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News