Chandrababu: నా ఆలోచనా విధానం దద్దమ్మలకు అర్థం కాదు: కొత్తూరు రోడ్ షోలో చంద్రబాబు

  • సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి
  • ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటన
  • శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో రోడ్ షో
  • యువతను ఉత్సాహపరిచేలా ప్రసంగం
  • యువత తోడుంటే ఏదైనా సాధ్యమేనని ఉద్ఘాటన
  • డీజే సాంగ్ కు చేతులు ఊపుతూ యువతను ఉత్సాహపరిచిన వైనం
Chandrababu rally in Srikakulam district Kothuru

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరులో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, వైసీపీ పాలనలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. 

బాబాయ్ ని చంపేసి నారాసుర రక్తచరిత్ర అంటారు... అవసరమైతే 'కోడికత్తి' శ్రీనును కూడా చంపేస్తారు అని వ్యాఖ్యానించారు. పుంగనూరులో నాపై హత్యాయత్నం జరిగితే, నాపైనే కేసు పెట్టారు అని చంద్రబాబు వెల్లడించారు. హత్యా రాజకీయాలు చేసేవారిని భూస్థాపితం చేస్తాం అని హెచ్చరించారు. 

టీడీపీ అధికారంలోకి రాగానే రైతును రాజును చేస్తాం... రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం అని హామీ ఇచ్చారు. ఏపీలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. యువత భవిష్యత్ తో ఆడుకుంటున్నారని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. 

"నా దగ్గర అభివృద్ధి మంత్రం ఉంది. నా ఆలోచనా విధానం దద్దమ్మలకు అర్థం కాదు. ఉద్యోగాల కల్పన మాతోనే సాధ్యం. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్టుబడులు ఎలా వస్తాయో చూడండి. టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నా. యువత నా వెనుక ఉంటే ఏదైనా సాధిస్తానన్న నమ్మకం నాకుంది. యువత ముందుకు వస్తే తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ అవుతుంది. 

శారీరకంగా కష్టపడడం కాదు, తెలివితేటలతో కష్టపడదాం. హ్యాపీగా పనిచేద్దాం... ప్రపంచానికి సత్తా చాటుదాం. కొత్తూరులో మీ ఉత్సాహం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది... కానీ నేను చాలా దూరం వెళ్లాల్సి ఉంది. 

యువత భవిష్యత్ బాగుండాలంటే సైకో పోవాలి. మతిస్థిమితం లేని వ్యక్తి ఏ పనులు చేస్తాడో, మన ముఖ్యమంత్రి అవన్నీ చేస్తాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మనకు అవసరమా?" అంటూ చంద్రబాబు ప్రసంగించారు. 

ప్రసంగం అనంతరం డీజే బాక్సుల్లోంచి సైకో పోవాలి సైకిల్ రావాలి అనే పాట వినిపించడంతో సభకు వచ్చినవారు డ్యాన్సులు చేశారు. వారిని చూసి చంద్రబాబు కూడా చేతులూ ఊపుతూ తన ఉత్సాహం ప్రదర్శించారు.

More Telugu News