minimum balance: ‘మినిమమ్ బ్యాలెన్స్’ పేరుతో బ్యాంకుల వేల కోట్ల బాదుడు.. పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం

  • వివిధ కారణాలతో కస్టమర్లపై బ్యాంకులు విధించిన చార్జీలు రూ.35 వేల కోట్లు
  • ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదని రూ.21 వేల కోట్ల వడ్డింపు
  • 2018 నుంచి ఈ చార్జీలను విధించిన బ్యాంకులు
public private banks collected 35000 crore rupees for non maintenance of minimum balance and others

బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ తప్పనసరి. కనీసం ‘ఇంత’ మొత్తం పెట్టాలని ఒక్కో బ్యాంకు ఒక్కోలా నిర్ణయిస్తాయి. అలా కనీస బ్యాలెన్స్ ఉంచకుంటే చార్జీలు బాదుతాయి. నెలనెలా అకౌంట్‌లో నుంచి కట్ చేసుకుంటాయి. వీటితోపాటు ఏటీఎం లావాదేవీ చార్జీలు, ఎస్సెమ్మెస్ చార్జీలు కూడా ఉంటాయి. ఇలా వసూలు చేసిన డబ్బు గురించిన వివరాలను పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వకంగా తెలిపింది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐదు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి ఇప్పటిదాకా వసూలు చేసిన సొమ్ము ఏకంగా రూ.35 వేల కోట్లకు పైనేనని తెలిపింది. అది కూడా 2018 నుంచి వసూలు చేసిన మొత్తమేనని చెప్పింది. ఇందులో రూ.21 వేల కోట్లు.. కేవలం కనీస బ్యాలెన్స్ లేదన్న కారణంతోనే విధించినట్లు వెల్లడించింది.

ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేటు సంస్థలైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు కనీస బ్యాలెన్స్ ఉంచలేదన్న కారణంతో రూ.21 వేలను కట్ చేసుకున్నాయి. ఏటీఎం లావాదేవీల కోసం రూ.8 వేల కోట్లు, ఎస్సెమ్మెస్ సేవలు అందిస్తున్నందుకు రూ.6 వేల కోట్లను వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

More Telugu News