vande bharat express: తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు!

  • నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ వద్ద అరగంట పాటు నిలిచిన రైలు
  • బాత్రూంలో సిగరెట్ ముక్క ప్లాస్టిక్‌కు అంటుకోవడంతో పొగ వ్యాప్తి చెందినట్లు గుర్తింపు
  • టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి అరెస్ట్
Smoke in Vande Bharat Express train

తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం సాయంత్రం పొగలు వచ్చాయి. తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్తోన్న వందే భారత్ రైలు నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ వద్దకు రాగానే పొగలు వచ్చాయి. గుర్తించిన రైల్వే సిబ్బంది మనుబోలు రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. ప్రయాణికులందర్నీ బోగీ నుండి కిందకు దింపారు.

మూడో బోగీలోని బాత్రూమ్ నుండి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి తనిఖీ చేశారు. అయితే కాల్చిపడేసిన సిగరెట్ ముక్క ప్లాస్టిక్ సామగ్రికి అంటుకోవడంతో పొగ వ్యాప్తిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనకు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి కారకుడని గుర్తించిన పోలీసులు, అతనిని అదుపులోకి తీసుకున్నారు. మంటలను పూర్తిగా ఆపివేసి, రైలును పంపించారు. దీంతో అరగంట పాటు రైలు నిలిచిపోయింది.

More Telugu News