West Bengal: దారుణం.. బిడ్డను చంపేస్తామంటూ రైల్లో తల్లిపై అఘాయిత్యం

  • అసోం నుంచి పశ్చిమబెంగాల్ వెళుతున్న సిఫాంగ్ రైల్లో శనివారం ఘటన
  • బోగీ ఖాళీగా ఉండటంతో మహిళపై ఇద్దరు యువకుల దురాగతం
  • రైలు గమ్యస్థానానికి చేరుకున్నాక పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
  • అదే రోజు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Two youth sexually assualts woman after threatening to kill her daughter

గువాహటి(అస్సాం) నుంచి అలీపూర్‌ద్వార్(పశ్చిమబెంగాల్) వెళుతున్న సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం దారుణం జరిగింది. బిడ్డను రైల్లోంచి తోసి చంపేస్తామంటూ ఓ మహిళపై ఇద్దరు తోటి ప్రయాణికులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించారు. 

మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె శనివారం మధ్యాహ్నం తన బిడ్డతో కలిసి గువాహటిలో రైలు ఎక్కింది. ఫకీరాగ్రామ్ చేరుకునే సరికి బోగీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఈ క్రమంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అసోం వాసులు అబు(25), మొయినుల్ హక్(26) బాధిత మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మహిళ బిడ్డను రైల్లోంచి తోసేస్తామంటూ ఆమెను బెదిరించి, కట్టేసి కొట్టారు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. రైలు అలీపూర్‌ద్వార్ జంక్షన్‌కు చేరుకున్నాక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

More Telugu News