TSSPDCL: సైబర్ నేరగాళ్ల నయా మోసం.. కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ మెసేజ్‌లు.. స్పందిస్తే ఖేల్ ఖతం!

  • పెండింగ్ బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ కట్‌చేస్తామంటూ మెసేజ్‌లు
  • లింక్‌పై క్లిక్ చేసి రూ. 6 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ వాసి
  • బిల్లుల కోసం విద్యుత్ సంస్థలు మెసేజ్‌లు పంపవన్న అధికారులు
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Cyber Criminals Eyes On Pending Power Bills

సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ఇప్పుడు విద్యుత్ వినియోగదారులపై పడ్డారు. కరెంటు బిల్లు పెండింగులో ఉందని, చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. నమ్మి వారు పంపిన మెసేజ్‌లోని లింకుపై క్లిక్ చేస్తే ఇక వారి పని గోవిందా. బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతుంది. హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన ఓ వ్యక్తి ఇలానే రూ. 6 లక్షలు పొగొట్టుకున్నాడు. ఆయన పోలీసులను ఆశ్రయించడంతో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది.

సైబర్ నేరగాళ్ల తాజా మోసంపై విద్యుత్‌శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బిల్లులు పెండింగులో ఉన్నాయంటూ ఫోన్లకు వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దని తెలిపారు. బిల్లు చెల్లించాలంటూ విద్యుత్ సంస్థలు ఎప్పుడూ వినియోగదారులకు మెసేజ్‌లు పంపవని, బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్, డెబిట్, క్రెడిట్‌కార్డు వివరాలను అడగరని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. కాబట్టి బిల్లులు చెల్లించాలంటూ వచ్చే మెసేజ్‌లు, లింకులపై క్లిక్ చేయొద్దని సూచించారు.

More Telugu News