Andhra Pradesh: బెంగళూరులో దారుణం.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి తెలుగు టెకీ ఆత్మహత్య!

  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ బెంగళూరులో స్థిరపడ్డ ఎపీకి చెందిన వీరార్జున విజయ్
  • సూసైడ్ నోట్ లేకపోవడంతో మిస్టరీగా మారిన ఘటన
Andhra techie kills wife 2 children then dies by suicide in Bengaluru

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణానికి పాల్పడ్డాడు. బెంగళూరులో పని చేస్తున్న వీరార్జున విజయ్ (31) తన భార్యను,  ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆపై అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న విజయ్ బెంగళూరులో స్థిరపడ్డాడు. అతనికి ఆరేళ్ల కిందట హైమవతి (29)తో వివాహమైంది. వీరికి రెండేళ్లు, ఎనిమిది నెలల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

విజయ్ జులై 31న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, అదే రోజు సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం సత్యసాయి లేఅవుట్‌లోని విజయ్ నివాసానికి హైమవతి సోదరుడు వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఎన్నిసార్లు తలుపు తట్టినా ఎవరూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. ఇంట్లో సూసైడ్ నోట్ లభించలేదని, దాంతో ఈ ఘటన మిస్టరీగా మారిందని పోలీసులు తెలిపారు.

More Telugu News