Pawan Kalyan: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మూడో విడత తేదీల ఖరారు

  • ఇప్పటికే రెండు విడతలు వారాహి యాత్ర చేపట్టిన పవన్
  • విశాఖ నుంచి మూడో విడత ప్రారంభం
  • ఈ నెల 10 నుంచి 19 వరకు మూడో విడత వారాహి
Dates finalized for Pawan Kalyan Varahi Vijaya Yatra third phase

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఇప్పటివరకు రెండు విడతలు పూర్తి చేసుకుంది. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ హైకమాండ్ వారాహి యాత్ర మూడో విడత తేదీలను ఖరారు చేసింది. 

ఈ నెల 10వ తేదీన విశాఖపట్నంలో మూడో విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుందని జనసేన పార్టీ వెల్లడించింది. అదే రోజున నగరంలో సభ ఉంటుందని, పవన్ వారాహి వాహనం పైనుంచి ప్రసంగిస్తారని తెలిపింది. మూడో విడత వారాహి యాత్ర 19వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించింది. 

ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ విశాఖలో జరుగుతున్న భూకబ్జాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలు చేపడతారని పేర్కొంది. పర్యావరణానికి నష్టం కలిగించేలా ధ్వంసం చేసిన ప్రాంతాలను కూడా పవన్ కల్యాణ్ సందర్శించనున్నారని జనసేన తెలిపింది. విశాఖలో జనవాణి కార్యక్రమం ఉంటుందని, ఇందులో పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని వెల్లడించింది. 

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు సంబంధించి నేడు 3 కమిటీలతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. యాత్ర తీరుతెన్నులపై నేతలతో చర్చించారు.

More Telugu News