Jaya Sudha: నేను బీజేపీలో చేరానంటే చాలామందికి ఆశ్చర్యం వేయవచ్చు కానీ..: జయసుధ

  • కులాలు, మతాలపరంగా కాకుండా ప్రజలకు మంచి చేయాలనే బీజేపీలో చేరానని వెల్లడి
  • మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని ప్రశంస
  • బీజేపీలో చేరికపై ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయన్న జయసుధ
  • తన పోటీపై జరిగేదంతా ప్రచారం మాత్రమేనని స్పష్టీకరణ
BJP clarifies why she is joining BJP

కులాలు, మతాలపరంగా కాకుండా తాను ప్రజలందరికీ మంచి చేయాలనుకుంటున్నానని, అందుకే బీజేపీలో చేరానని ప్రముఖ సినీ నటి జయసుధ అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె నేడు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ విషయాన్ని తాను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, అందరికీ తెలిసిందేనన్నారు.

తాను బీజేపీలో చేరానంటే చాలామందికి ఆశ్చర్యం వేయవచ్చునని, కానీ కులాలపరంగా కాకుండా మంచి కోసం పని చేయాలని భావిస్తున్నానని చెప్పారు. బీజేపీలో చేరడంపై ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయని, అమిత్ షాను కూడా కలిశామన్నారు. నటిగా తాను అందరికీ చెందిన వ్యక్తిని అన్నారు. ప్రజలకు... పేదలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతోనే బీజేపీని ఎంచుకున్నట్లు చెప్పారు. తాను సికింద్రాబాద్, ముషీరాబాద్‌ల నుండి పోటీ చేస్తాననేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. తాను ఇక సినిమాల కంటే రాజకీయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు.

More Telugu News