Pakistan: ఇస్లాంలోకి మారిన భారత మహిళ అంజూకు పాక్‌లో కానుకగా భూమి, నగదు

  • ఫేస్‌బుక్ ప్రియుడి కోసం పాక్ వెళ్లిన రాజస్థాన్ మహిళ అంజూ
  • ఇస్లాంలోకి మత మార్పిడి, ప్రియుడితో వివాహం
  • మతం మారిన ఆమెకు కానుకగా భూమి, నగదు ఇచ్చిన స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి
  • నూతన బంధం సాఫీగా సాగిపోవాలని బహుమతులు ఇచ్చినట్టు వ్యాపారి ప్రకటన
Indian woman anju receives land and money as gift for converting to islam in pakistan

ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారత మహిళ అంజూ అతడిని వివాహమాడేందుకు ఇస్లాంలోకి మారిన సంగతి విదితమే. ఆమె మతం మారినందుకు పాకిస్థాన్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజూకు భారీ బహుమతి ఇచ్చాడు. 2722 చదరపు అడుగుల భూమితో పాటూ కొంత నగదును చెక్కు రూపంలో ఇచ్చాడు. 

రాజస్థాన్‌కు చెందిన అంజూకు 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఆమెకు పాకిస్థానీ యువకుడు నస్రుల్లాతో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఖైభర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని అప్పర్ దిల్ జిల్లాలో గల ఓ గ్రామంలో నస్రుల్లా నివసిస్తుంటాడు. కాగా, వారి పరిచయం ప్రేమగా మారడంతో ఆమె ప్రియుడి కోసం దేశం దాటింది. ఈ నెల 25న నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. ఇందుకోసం ఆమె మతం మారింది. 

అయితే, అంజూను తమ మతంలోకి ఆహ్వానిస్తూ స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసిన ఖాన్ అబ్బాసి భూమి, నగదును చెక్కు రూపంలో బహుమతిగా ఇచ్చారు. చెక్కు ఎంతకు రాసిచ్చారనేది మాత్రం తెలియరాలేదు. ‘‘అంజూ భారత్ నుంచి ఇంత దూరం వచ్చి ఇస్లాంలోకి మారి కొత్త జీవితం ప్రారంభించింది. ఆమెను మా మతంలోకి ఆహ్వానించడంతో పాటు ఆ దంపతులకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చాను. మతం మారిన ఆమెకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కానుకలు ఇచ్చాను’’ అని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పుకొచ్చాడు.

More Telugu News