JAYASUDHA: బీజేపీలోకి సినీ నటి జయసుధ..?

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
  • 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ
  • గతంలోనూ బీజేపీలో చేరికపై ఊహాగానాలు
JAYASUDHA MEETS KISHAN REDDY

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని పార్టీలు అన్నీ చేరికలపై దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. దీంతో జయసుధ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై కిషన్ రెడ్డితో చర్చించినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ టికెట్ పై 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

బీజేపీలో చేరేందుకు జయసుధ గతంలోనూ చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి బీజేపీ నేతలను కలిసినట్లు సమాచారం. పార్టీ చేరికల కమిటీతో జయసుధ చర్చలు జరిపారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే, అప్పట్లో జరిగిన ఈ చర్చల తర్వాత అటు బీజేపీ కానీ ఇటు జయసుధ కానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చర్చల సందర్భంగా పార్టీలో చేరే విషయంపై జయసుధ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని బీజేపీ నాయకులు గతంలో పేర్కొన్నారు. తాజాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలవడంతో జయసుధ త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.

More Telugu News