Jagan: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్.. సహాయంపై కీలక ఆదేశాలు

  • ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు
  • అనేక ప్రాంతాల్లో ముంపుకు గురైన గ్రామాలు
  • ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలన్న సీఎం జగన్
  • దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేల చొప్పున చెల్లించాలని ఆదేశం
  • ముంపు బాధితులకు 25 కిలోల బియ్యం ఇవ్వాలని వెల్లడి
CM Jagan conducts video conference with collectors on rains and flood

గత కొన్ని రోజులుగా ఏపీలో పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. నదులు ఉప్పొంగుతుండడంతో చాలాచోట్ల ప్రజలు వరద ముంపు బారినపడ్డారు. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై సమీక్ష చేపట్టారు. ముఖ్యంగా గోదావరి ప్రవాహ తీవ్రత, వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ముంపు బాధితులకు అండగా నిలవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 

శిబిరాల నుంచి తిరిగి తమ నివాసాలకు వెళ్లే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలని స్పష్టం చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లోని బాధితులకు 25 కిలోల చొప్పున బియ్యం అందజేయాలని సూచించారు. కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో కందిపప్పుతో పాటు పామాయిల్ కూడా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ముఖ్యంగా, భారీ వర్షాలు, వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో పంటల నష్టం వివరాలు నమోదు చేసి రైతులకు అండగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. 

గర్భవతులు, బాలింతల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకునేలా వైద్య ఆరోగ్య సిబ్బంది కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. గర్భవతులు, బాలింతలను వైద్య వసతి ఉన్న చోటుకు తరలించాలని ఆదేశించారు.

More Telugu News