తెలంగాణలోని పది జిల్లాలకు నేడు అత్యంత భారీ వర్షాల రెడ్ అలర్ట్

  • ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు
  • పలు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలు
  • మరో రోజు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడి
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదల్లో గంల్లంతైన పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఈ రోజు కూడా పలు జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 24 సెంటీమీటర్ల పైచిలుకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 

అలాగే, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

rain
IMD
red alert
Telangana

More Telugu News