UFOs: గ్రహాంతర వాసుల వివరాలను అమెరికా దాచిపెడుతోంది: యూఎస్ మాజీ నిఘా అధికారి

  • అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సంచలన విషయాల వెల్లడి
  • యూఎఫ్‌ఓలు, గ్రహాంతర వాసుల మృతదేహాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని వ్యాఖ్య
  • ఈ విషయాలు బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోందని వెల్లడి
  • అమెరికా పార్లమెంటుకు కూడా ఈ విషయాలు తెలియవని వ్యాఖ్య
US Hiding Info On Alien Craft Ex Intel Officer In Congressional Testimony

గ్రహాంతర వాసులు ఉన్నారా? అన్న ప్రశ్నకు తొలిసారిగా నిర్దిష్టమైన సమాధానం లభించింది. గ్రహాంతర జీవులకు చెందిన అంతరిక్ష నౌకల వివరాలు అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నాయని అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సంచలన ప్రకటన చేశారు. బుధవారం అమెరికా పార్లమెంట్ కమిటీ ముందు ప్రమాణపూర్వకంగా ఈ వివరాలను వెల్లడించారు. 

గ్రహాంతర వాసులు వినియోగించిన రవాణా సాధనాలు అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నట్టు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రష్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ వాహనాలు నడిపిన గ్రహాంతర వాసుల మృతదేహాలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. సాధారణ ప్రజానీకం ఈ వ్యోమనౌకలను యూఎఫ్ఓలని పిలుస్తుండగా ప్రభుత్వం మాత్రం తన రహస్య పత్రాల్లో యూఏపీ అని వీటికి నామకరణం చేసింది. 
  ‘‘దశాబ్దాల పాటు సాగిన నా కెరీర్‌లో యూఏపీలు కూలిపోయిన స్థలాలు, యూఏపీలను రివర్స్ ఇంజినీరింగ్ చేసే ప్రయత్నాల గురించి కొందరు చెప్పారు. నా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళదామని నిర్ణయించుకున్నాను. ఇలా చేస్తే నేనో విజిల్ బ్లోవర్‌గా మారతానన్న విషయం నాకు తెలుసు’’ అని డేవిడ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల ముందు వ్యాఖ్యానించారు. 

వీటికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పాలని కమిటీ కోరగా ఆయన తిరస్కరించాడు. ఇటువంటి బహిరంగ వేదికలపై ఆ రహస్య వివరాలు వెల్లడించలేనంటూ నిస్సహాయత వ్యక్తం చేశాడు. గ్రహాంతర వాసుల వివరాలను అమెరికా ప్రభుత్వం ప్రజలు, అమెరికా కాంగ్రెస్‌కు తెలియనీయకుండా రహస్యంగా ఉంచుతోందని చెప్పారు. గ్రహాంతర వాసుల వ్యోమనౌకల వివరాలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన వారిని తాను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు. ‘‘దశాబ్దాల పాటు అమెరికాకు సేవ చేసిన, విశ్వసనీయత గడించిన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నా వాంగ్మూలం ఇస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

కాగా, డేవిడ్ వాదనలకు అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు టిమ్ బుర్చెట్ మద్దతు పలికారు. ప్రభుత్వం కీలక సమాచారాన్ని దాచి పెడుతోందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇది ప్రభుత్వ పారదర్శకతకు సంబంధించిన అంశం. ప్రజలపై నమ్మకం లేని ప్రభుత్వాన్ని తాము కూడా నమ్మలేము’’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతర వాసుల అంశం మరోసారి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. గగనతలంలో గుర్తుతెలియని కొన్ని ఎగిరే వస్తువులను చూశామని గతంలో అనేక మంది చెప్పారు. అవి గ్రహాంతర వాసుల వాహనాలేనని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కొన్నేళ్లుగా మౌనం పాటిస్తోంది.

More Telugu News