Yadadri Bhuvanagiri District: కాంగ్రెస్‌కు షాక్.. ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమైన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు

  • కోమటిరెడ్డితో గ్రూప్ రాజకీయాలతో మనస్తాపానికి గురైనట్లు అంతకుముందే వెల్లడి
  • పార్టీలో జరుగుతున్న పరిణామాలు చర్చించేందుకు అనుచరులతో సమావేశం
  • ఇప్పటికిప్పుడు పార్టీ మారేది లేదన్న డీసీసీ అధ్యక్షుడు
  • అంతలోనే కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రితో భేటీ
DCC president may join BRS soon

యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ లో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ కు వెళ్లారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కలిశారు. ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంపీ కోమటిరెడ్డి గ్రూప్ రాజకీయాలతో తాను మనస్తాపానికి గురైనట్లు అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు.

అంతకుముందు భువనగిరిలో అనిల్ కుమార్ మాట్లాడుతూ... పార్టీలో జరుగుతున్న పరిణామాలు చర్చించేందుకు తాను తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తనకు ఎంపీ కోమటిరెడ్డితో ఇబ్బందులు ఉన్నాయని, అందుకే కార్యకర్తల సమావేశం నిర్వహించానన్నారు. తన ఇంట్లో ఐదారు సీట్లు తీసుకున్నప్పుడు ఆయనకు బీసీలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడేమో బీసీలకు భువనగిరి టిక్కెట్ ఇవ్వాలని సమాంతరంగా సమావేశాలు పెడుతూ పార్టీ కేడర్ ను పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్నారన్నారు.

తాను ఇప్పటికిప్పుడు పార్టీ మారేది లేదని, కోమటిరెడ్డి అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి తన అడుగులు ఉంటాయన్నారు. అయితే అంతలోనే ఆయన సాయంత్రం ప్రగతి భవన్ కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

More Telugu News