YS Sunitha: సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ భారతి, సజ్జల అంశాన్ని ప్రస్తావించిన సునీత.. వాంగ్మూలంలో సంచలన విషయాలు!

  • తన ఇంటికి వచ్చినప్పుడు భారతి ఎంతో ఆందోళనతో ఉన్నారన్న సునీత
  • ఏం చేసినా సజ్జలతో టచ్ లో ఉండాలని చెప్పారని వెల్లడి
  • హత్య గురించి మీడియాతో మాట్లాడాలని సజ్జల తనతో చెప్పారన్న సునీత
  • టీడీపీ నేతలే నేరం చేశారని అవినాశ్ రెడ్డి తనతో చెప్పారని వ్యాఖ్య
  • భారతి, సజ్జల మధ్య జరిగిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను సీబీఐకి ఇచ్చిన సునీత
YS Sunitha allegations on YS Bharathi and Sajjala Ramakrishna Reddy in her statement to CBI in YS Viveka murder case

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన కూతురు సునీత సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లను ఆమె ప్రస్తావించడం సంచలనం రేపుతోంది. తన ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి తనకు ఫోన్ చేశారని... తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్లకు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని సునీత తెలిపారు. ఎక్కువ సమయం తీసుకోనని చెప్పిన భారతి వెంటనే తన ఇంటికి వచ్చారని చెప్పారు. అయితే ఆమెతో పాటు విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడంతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. లిఫ్ట్ వద్దే భారతితో తాను మాట్లాడానని, ఆ సమయంలో భారతి చాలా ఆందోళనగా కనిపించారని చెప్పారు. 

నాన్న చనిపోయిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చినందున భారతి బాధగా ఉన్నారని తాను అనుకున్నానని సునీత చెప్పారు. అయితే, ఇకపై ఏం చేసినా సజ్జలతో టచ్ లో ఉండాలని తనతో భారతి చెప్పారని సునీత తెలిపారు. హత్య గురించి మీడియాతో మాట్లాడాలని సజ్జల తనతో చెప్పారని... ఆయన ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని చెప్పారు. గది శుభ్రం చేసేటప్పుడు అక్కడున్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియోను పంపించానని తెలిపారు. అయితే, వీడియో పంపించడం కాదు, ఈ వివాదానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని సజ్జల చెప్పారని... జగనన్నతో పాటు అవినాశ్ పేరును కూడా ప్రస్తావించాలని సలహా ఇచ్చారని చెప్పారు. అప్పటి వరకు తాను ఎక్కడా అవినాశ్ పేరును ప్రస్తావించలేదని... అవినాశ్ పేరును ప్రస్తావించాలని చెప్పినప్పుడు కొంత సంకోచించానని తెలిపారు. 

అవినాశ్ రెడ్డికి కడప ఎంపీ అభ్యర్థిత్వాన్ని తన తండ్రి కోరుకోలేదని సునీత చెప్పారు. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయని తెలిపారు. సజ్జల సలహా మేరకే హైదరాబాదులో తాను ప్రెస్ మీట్ పెట్టానని చెప్పారు. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని తొలి నుంచి అడుగుతున్నానని అన్నారు. జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారని... ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని చెప్పారు. పొరపాటు జరిగిందనే విషయం తనకు తెలుసని... క్రిమినల్ మైండ్ ఎలా పని చేస్తుందో మాత్రం అర్థం చేసుకోలేదని అన్నారు. 

మార్చురీ బయట ఉన్నప్పుడు ఒక ఫిర్యాదును రాసుకొచ్చి సంతకం చేయమన్నారని సునీత తెలిపారు. ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, ఇతర టీడీపీ నేతలపై ఆరోపణలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని, టీడీపీ నేతలే ఈ నేరానికి పాల్పడ్డారని అవినాశ్ తనతో అన్నారని చెప్పారు. ఆ ఫిర్యాదుపై తాను సంతకం చేయలేదని వెల్లడించారు.

2019 జులైలోనే అవినాశ్ పై తనకు అనుమానం మొదలయిందని సునీత తెలిపారు. వివేకా మృతి విషయం తన కుమారుడికి ముందే తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని... అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి తనకు అనుమానం వచ్చిందని చెప్పారు. వైఎస్ భారతి, సజ్జల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను సీబీఐకి సమర్పించారు.

More Telugu News