Virat Kohli: కోహ్లీని హత్తుకొని, ముద్దుపెట్టుకొని ఉద్వేగానికి లోనైన విండీస్​ క్రికెటర్ తల్లి

  • వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ 
  • కోహ్లీని కలుసుకున్న విండీస్ ఆటగాడు జాషువా తల్లి
  • ఆమెను ఆప్యాయంగా పలుకరించిన విరాట్
The moment Joshua Da Silva mother met Virat Kohli

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉంటారు. కోహ్లీ ఏ దేశానికి వెళ్లినా అతని ఆట చూసేందుకు ఎంతో మంది స్టేడియాలకు వస్తుంటారు. ప్రత్యర్థి దేశాల జట్లలో సైతం అతనికి వీరాభిమానులు ఉంటారు. అతని ఆటకు సలాం కొడుతుంటారు. ఆట ముగిసిన తర్వాత కోహ్లీతో కరచాలనం చేసేందుకు ఫొటోలు దిగేందుకు పోటీ పడటం చూస్తుంటాం. తాజాగా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీపై విండీస్ యువ క్రికెటర్ తల్లి తన అభిమానాన్ని చాటుకుంది. విండీస్ క్రికెటర్ జాషువా డసిల్వ తల్లి కోహ్లీకి వీరాభిమాని. రెండో టెస్టు సందర్భంగా అతడిని కలుసుకునే అవకాశం ఆమెకు లభించింది.
కోహ్లీని దగ్గరి నుంచి చూడగానే ఆమె ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయింది. అతడిని ఆప్యాయంగా హత్తుకొని ముద్దుపెట్టుకుంది. కోహ్లీ కూడా ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు. అతనితో కలిసి ఆమె ఫొటో దిగింది. విండీస్ ఆటగాడు జాషువా ఈ ఫొటో తీయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీని తాను, తన కుమారుడు ఎంతో ఆరాధిస్తామని ఆమె చెప్పింది. అతడిని తన కుమారుడిలా భావిస్తానని చెప్పింది. ఇక కోహ్లీ బ్యాటింగ్ చూడటానికే తన తల్లి స్టేడియానికి వచ్చిందని జాషువా వెల్లడించాడు.

More Telugu News