china: భూమి లోపలికి మరోసారి పదిన్నర కి.మీ రంధ్రం తవ్వుతున్న చైనా.. ఎందుకంటే..!

  • సహజ వాయువు నిల్వలు పెంచుకునేందుకు చైనా ప్రయత్నం
  • సిచువాన్ ప్రావిన్స్‌లో 10,520 మీటర్ల లోతు బోరు బావి తవ్వకం
  • ఇప్పటికే షింజియాంగ్ ప్రాంతంలోనూ ఇంతే లోతు రంధ్రం చేసిన చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్
 China Drilling another 10000 metre hole

సహజ వాయువు నిల్వలను పెంచేందుకు చైనా మరో కీలక ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది రెండోసారి భూమి లోపలికి ఏకంగా పది వేల మీటర్ల లోతులో రంధ్రం తవ్వుతోంది. చైనా నేషనల్ పెట్రోలియం కార్పోరేషన్ సిచువాన్ ప్రావిన్స్‌లోని షెండి చువాన్కే లో 10,520 మీటర్లు (పదిన్నర కిలోమీటర్లు) లోతు బోరును తవ్వడం ప్రారంభించింది.

 గతంలో షింజియాంగ్ ప్రాంతంలోనూ ఇలానే పది వేల మీటర్ల లోతైన రంధ్రాన్ని చేసింది. అప్పట్లో ఇది చైనాలో చేపట్టిన అత్యంత లోతైన ప్రాజెక్టుగా ఉంది. డ్రిల్లింగ్ సాంకేతికతను పరీక్షించడంతో పాటు, భూమి లోపలి అంతర్గత నిర్మాణంపై కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు షింజియాంగ్ లో ఈ భారీ రంధ్రాన్ని తవ్వినట్లు అప్పుడు చైనా చెప్పుకొచ్చింది. కానీ, దాని గురించి ఇతర వివరాలేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడింది. 

ఇప్పుడు సిచువాన్ ప్రాంతంలో చేస్తున్న భారీ రంధ్రం ద్వారా భూమి లోపలి పొరల్లో సహజ వాయు నిక్షేపాలను గుర్తించేందుకు భారీగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్పైసి ఫుడ్, అద్భుతమైన పర్వత శ్రేణులు, పాండాలకు ప్రసిద్ధి చెందిన సిచువాన్ అతిపెద్ద షేల్ గ్యాస్ నిల్వలకు కూడా నిలయం. కానీ, సంక్లిష్టమైన భూగర్భం ఉండటంతో వాటిని వెలికి తీయడం కష్టంగా మారింది. అయితే, చైనా ఇంధన వినియోగం రోజురోజుకూ పెరగడంతో పెట్రోలియం ఉత్పత్తి సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. 

విద్యుత్ కొరత, భౌగోళిక రాజకీయ కలహాలు, ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరల అస్థిరత కొనసాగుతున్న వేళ దేశీయంగా ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టింది. వీలైనంత ఎక్కువ సహజ వాయువును బయటికి తీసి భద్రపరుచుకోవాలని చూస్తోంది. ఇంధన భద్రతను సాధించాలని ఆయన కంపెనీలపై చైనా ఒత్తిడి చేస్తోంది. ఈ ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు సిచువాన్ ప్రాంతంలో భారీగా తవ్వకాలు జరుపుతోంది. కాగా, ప్రపంచంలోనే మానవులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. 1989లో చేసిన ఈ రంధ్రాన్ని కోలా సూపర్ డీప్ బోరు హోల్ గా పిలుస్తారు. 12,262 మీటర్ల లోతున్న ఈ భారీ రంధ్రాన్ని తవ్వడానికి ఏకంగా 20 ఏళ్లు పట్టింది.

More Telugu News