Telangana: తెలంగాణలో రెడ్ అలర్ట్.. రెండు మూడు గంటల్లో భారీ వర్షం

  • తెలంగాణాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
  • రాష్ట్రంలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ,14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • ఏపీలో కోస్తా రాయలసీమల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం 
  • హైదరాబాద్ వాసులకు డేంజర్ వార్నింగ్, రెండు మూడు గంటల్లో భారీ వర్షానికి ఛాన్స్
  • ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు దిశగా ప్రయత్నం
  • హైదరాబాద్‌లో పోటెత్తుతున్న హుస్సేన్ సాగర్
Heavy rain alert for Telangana and Andhrapradesh

ఓవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవి చాలవన్నట్టు ఉపరితల అవర్తనం వెరసి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో కోస్తా రాయలసీమల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఇక హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది, వచ్చే రెండు మూడు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అత్యవసరమైతేనే బయటకు ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం మెచ్చరిస్తోంది. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ పోటెత్తుతోంది. తూము ద్వారా అధిక మొత్తంలో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 

మరోవైపు, ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ సెలవు ప్రకటించింది. ప్రైవేటు కార్యాలయాలూ సెలవులు ప్రకటించేలా కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మరో నాలుగైదు రోజులు కుండపోత తప్పదని వాతావరణ శాఖ పేర్కొంది.

More Telugu News