పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు, విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

  • వాలంటీర్లపై జనసేనాని వ్యాఖ్యల దుమారం
  • పవన్ కల్యాణ్ విచారణకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు అధికారుల వెల్లడి
  • ఐసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ మేరకు గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వారాహి యాత్రలో భాగంగా జనసేనాని వాలంటీర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గత కొన్నిరోజులుగా అధికార పార్టీ నాయకులు, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతేకాదు, పవన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా ఈ రోజు వార్తలు వచ్చాయి.

తాజాగా, వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్ పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై 9న పవన్ మాట్లాడుతూ... ఏపీలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో కొంతమందిని మాత్రమే గుర్తించారని, మిగతా వారు ఏమయ్యారో తెలియదన్నారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళుతోందన్నారు.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఐసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ పై పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు.

Pawan Kalyan
Janasena
Andhra Pradesh
YSRCP

More Telugu News