ఐక్యంగా ఉందామన్న అజిత్ పవార్ వర్గం.. శరద్ పవార్ ఏమన్నారంటే..!

  • బీజేపీతో ఎన్నటికీ కలిసేది లేదని తేల్చిచెప్పిన ఎన్సీపీ చీఫ్
  • తిరుగుబాటు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లిన కాసేపటికి ప్రకటన
  • బీజేపీవి విభజన రాజకీయాలంటూ విమర్శించిన సీనియర్ పవార్
విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీతో ఎన్నటికీ కలిసేది లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో తన దారిని మార్చుకునే ప్రసక్తే లేదని, బీజేపీని ఎన్నటికీ సమర్థించబోనని తేల్చిచెప్పారు. ఈమేరకు ఆదివారం ఎన్సీపీ యూత్ వింగ్ వర్కర్లతో జరిగిన సమావేశంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు శరద్ పవార్ ను అజిత్ పవార్ వర్గం కలిసింది.

అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ సహా మిగతా నేతలంతా వైబీ చవాన్ సెంటర్ లో శరద్ పవార్ ను కలిశారు. ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండా నేరుగా వెళ్లి శరద్ పవార్ తో భేటీ అయ్యారు. పార్టీని ఒక్కటిగా కలిపే ఉంచాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో శరద్ పవార్ మౌనం వీడలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అజిత్ వర్గం నేతలు చెప్పింది వినడమే తప్ప ఒక్క మాట కూడా మాట్లడలేదని వెల్లడించాయి.

అనంతరం పార్టీ యూత్ వింగ్ కార్యకర్తలతో శరద్ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోగ్రెసివ్ పాలిటిక్స్ కొనసాగిస్తానని, బీజేపీకి మద్దతివ్వబోనని తేల్చిచెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని కార్యకర్తలకు శరద్ పవార్ సూచించారు.

Sharad Pawar
NCP
BJP
Ajit pawar
Maharashtra
politics

More Telugu News