Ambati Rayudu: నేను రాజకీయ పార్టీల వైపు వెళ్లడంలేదు: అంబటి రాయుడు

  • మంగళగిరిలో అక్షయపాత్ర వంటశాలను పరిశీలించిన రాయుడు
  • ప్రస్తుతం తాను సమాజాన్ని అధ్యయనం చేస్తున్నానని వెల్లడి
  • సామాజిక సేవ చేసేవారిని కలుస్తున్నానని వివరణ
  • ఇప్పటివరకైతే రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
Ambati Rayudu said he is not joining any party

క్రికెట్ కు పూర్తిస్థాయిలో వీడ్కోలు పలికిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తాడంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలను సందర్శించిన సందర్భంగా అంబటి రాయుడు రాజకీయ రంగప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. 

ప్రస్తుతం తాను సమాజాన్ని అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. తాను రాజకీయ పార్టీల వైపు అడుగులు వేయడంలేదని స్పష్టం చేశారు. 

"అక్షయపాత్ర వంటశాలను సందర్శించడం సంతోషంగా ఉంది. 22 లక్షల మంది చిన్నారులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా భోజనం అందిస్తున్నారు. ఏపీలోనూ కొన్ని స్కూళ్లలో జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర వంటశాల నుంచే భోజనాలు వెళుతున్నాయని తెలిసింది. అక్షయపాత్ర కిచెన్లు అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నడుస్తున్నాయి. పరిశుభ్రతపరంగానూ, భద్రతా పరంగానూ విశిష్ట రీతిలో కొనసాగుతున్నాయి.

క్రికెట్ నుంచి రిటైరయ్యాక విదేశాల్లో లీగ్ లు ఆడాలంటూ ఆహ్వానాలు అందాయి. అయితే సొంత రాష్ట్రానికి ఏదైనా సేవ చేయాలన్నదే నా ఉద్దేశం. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశం లేదు. సామాజిక సేవ చేసేవారిని కలుస్తున్నాను. నా వంతుగా ఏం చేయాలన్నదానిపై దృష్టి పెట్టాను" అని అంబటి రాయుడు వివరించారు.

More Telugu News