Revanth Reddy: గజ్వేల్‌లో కేసీఆర్ పోటీ చేయాలి.. సిట్టింగులకు సీట్లివ్వాలి: రేవంత్ రెడ్డి సవాల్

  • కేసీఆర్ ను ఓడించేందుకు మా కార్యకర్త చాలన్న రేవంత్
  • 3500 సబ్ స్టేషన్ల వద్దకు వెళ్లి చూద్దామా? అని సవాల్
  • తెలంగాణ మంత్రుల వాదనలో పస లేదని వ్యాఖ్య
KCR should contest from Gajwel in next election Revanth Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ కు దమ్ముంటే గజ్వేల్ నుండి మళ్లీ పోటీ చేయాలని, అలాగే సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మీడియా లీడ్ ఇదే... నేను చెప్పింది రాయండి.. అంటూ విలేకరులకు సూచించారు. గాంధీ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు తాను అవసరం లేదని, తమ పార్టీ కార్యకర్త చాలు అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే గజ్వేల్ నుండి పోటీ చేయాలని, లేదంటే మాడ అని ఒప్పుకోవాలన్నారు. కేసీఆర్ ఎక్కడి నుండి పోటీ చేస్తే తాను అక్కడి నుండి సిద్ధమని బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పారని, ఆయన పోటీ చేస్తారా? అడగండి అన్నారు.

విద్యుత్ తో తెలంగాణలో వెలుగులు నింపిందే నిజమైతే బీఆర్ఎస్ లో ఎవరిచోట్ల వారు పోటీ చేయాలన్నారు. తన సవాల్ కు కేటీఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ స్వప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుండి పోటీ చేస్తే గెలుస్తానో కేసీఆర్ సర్వేలు చేయించుకుంటున్నారని, కానీ గజ్వేల్ నుండే పోటీ చేసి, సత్తా నిరూపించుకోవాలన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని చెబుతున్నారని, కానీ మీ ముఖం అద్దంలో చూసుకోవాలని ఎద్దేవా చేశారు.

సబ్ స్టేషన్ల వద్దకు వెళదామా?

రాష్ట్రంలో 3500 సబ్ స్టేషన్లు ఉన్నాయని, 24 గంటల విద్యుత్ ఉందని అక్కడకు వెళ్లి చూద్దామా? అని సవాల్ చేశారు. విద్యుత్ ఇచ్చినట్లు తేలితే ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు అడగదని, 24 గంటలు ఇవ్వలేదని తేలితే బీఆర్ఎస్ ఓట్లు అడగకూడదన్నారు. సిగ్గు.. శరం ఉంటే ఈ సవాల్ స్వీకరించాలని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణ మంత్రుల వాదనలో పస లేదన్నారు. 

వచ్చే ఎన్నికల తర్వాత వ్యవసాయానికి కాంగ్రెస్ 24 గంటల విద్యుత్ ఇస్తుందని, కేసీఆర్ కరెంట్ అవినీతిని అంతం చేస్తుందన్నారు. పార్టీ పిరాయించిన తలసాని, మల్లారెడ్డి, గుత్తా, పోచారం, ఇంద్రకరణ్, గంగుల, నిరంజన్ రెడ్డి, ఊసరవెల్లి దయాకర్.. వీరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. మహిళల గురించి మాట్లాడవద్దని.. కానీ ఆ అక్క, ఈ అక్క ఎక్కడున్నారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను సచివాలయంలోకి కూడా రానివ్వడం లేదన్నారు. సలహాదారులుగా అవినీతిపరులను పెట్టుకున్నారని ఆరోపించారు.

More Telugu News