చంద్రబాబు హయాంలో ఆలయాలు కూల్చేస్తే పవన్ ఎక్కడున్నాడు?: మంత్రి కారుమూరి

  • చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని కారుమూరి విమర్శలు
  • తణుకులో బెల్ట్ షాప్ ఉందని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్
  • వాలంటీర్లు వైసీపీ కండువా కప్పుకోలేదని స్పష్టీకరణ
ఏపీలో హిందూ ధర్మాన్ని టార్గెట్ చేశారని వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. పవన్ తణుకు బహిరంగ సభ అనంతరం మంత్రి స్పందించారు. చంద్రబాబు హయాంలో 400 ఆలయాలను కూల్చి వేస్తే పవన్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదువుతున్నారని ఆరోపించారు.

తణుకులో బెల్ట్ షాపుల గురించి మాట్లాడారని, అక్కడ ఒక్క బెల్ట్ షాప్ ఉందని నిరూపించినా రాజకీయాల నుండి తప్పుకుంటానని మంత్రి కారుమూరి సవాల్ చేశారు. మద్య నిషేధంపై పవన్ కు ఓ క్లారిటీ లేదన్నారు. 

వాలంటీర్లు వైసీపీ కండువా కప్పుకోలేదనే విషయం పవన్ గుర్తించాలన్నారు. జనసేనాని ఒక్క వాలంటీర్ ను జైలుకు పంపించగలిగినా తాను సెంటర్ లో ఉరేసుకుంటానన్నారు.

గతంలో కారుమూరి ఎర్రిపప్ప అనే కామెంట్ చేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. అన్నం పెట్టే రైతనన్ను ఎర్రిపప్ప అంటావా.. మీది ఎర్రిపప్ప ప్రభుత్వం.. మీకు ఎర్రిపప్ప ట్యాక్స్ లు కట్టాలంటే తమ వల్ల కాదన్నారు. దీనిపై కారుమూరి మాట్లాడుతూ... పవన్ సుద్ద ఎర్రిపప్ప అని, తాను ఆ వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు, టీడీపీ నేతలను ఉద్దేశించి అని తెలిపారు.

వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, పవన్ లు వారు అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను రద్దు చేస్తారా? అని మరో మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. మేనిఫెస్టోలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామనే అంశాన్ని పెట్టగలరా? అని సవాల్ విసిరారు. కరోనా సమయంలో వాలంటీర్లు ఎంతో సేవ చేశారని, కానీ చంద్రబాబు, పవన్ లు మాత్రం హైదరాబాద్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. పెళ్లిళ్లు చేసుకోవడంలో మాత్రం పవన్ విప్లవకారుడు అని ఎద్దేవా చేశారు.


More Telugu News

Chandrababu karumuri nageswara rao Pawan Kalyan YSRCP