Chandrababu: కక్షపూరిత రాజకీయాలతో రాజధాని లేని రాష్ట్రంగా మారిన ఏపీ: చంద్రబాబు

  • ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ కార్యక్రమం
  • జగన్ ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాలకు రాష్ట్రం బలయ్యిందంటూ ఆగ్రహం
  • అసమర్థతతో పోలవరాన్ని, కక్షతో అమరావతిని జగన్ నాశనం చేశారని మండిపాటు
  • అధికారంలోకి వచ్చాక సవాళ్లను అధిగమించి సంపద, సంక్షేమం సృష్టిస్తామని హామీ
  • తమిళనాడు ప్రజల్లా రాష్ట్రం కోసం మనం ఏకం కాలేమా అని ప్రజలకు సూటి ప్రశ్న
Chandra babu press meet in undavalli

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో తాజాగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో చిట్‌చాట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజలు బాధను అనుభవించారని, రాష్ట్రం కూడా నష్టపోయిందన్న టీడీపీ అధినేత..రాష్ట్రానికి విభజనతో జరిగిన నష్టం కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. 

సీఎం జగన్ మూర్ఖపు నిర్ణయాలకు రాష్ట్రం బలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తన అసమర్థతతో పోలవరాన్ని, కక్షతో అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. దీని వల్ల అంతిమంగా నష్టపోయింది రాష్ట్రం, ప్రజలే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, పాలనా వ్యవహారాలు, ప్రజల సమస్యలు, టీడీపీ నిర్వహించబోయే కార్యక్రమాలపై తన ఆలోచనలు పంచుకున్నారు.
 
కక్ష పూరిత రాజకీయాలతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ

ఒక విజన్‌తో నాడు హైదరాబాద్‌ను అభివృద్ది చేశామని ఆ ఫలితాలు మన కళ్ల ముందు ఉన్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి రాజధాని మనకు ఉండాలని, పెట్టుబడులకు, ఉద్యోగాల కల్పనకు కేంద్రం కావాలని తాను అమరావతిని తలపెట్టినట్లు చెప్పారు. అయితే జగన్ తన కక్ష పూరిత రాజకీయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అన్నారు. దీని వల్ల నష్టపోయింది ప్రజలు, రాష్ట్రం కాదా? అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు జగన్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు రాజధాని కేసు డిసెంబర్‌కు వాయిదా పడిందని, అది ఎప్పుడు తేలుతుందో తెలీదు అని అన్నారు. ఈ కారణంగా 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేసిన పాపం జగన్ దే అని చంద్రబాబు తేల్చిచెప్పారు. 

తెలంగాణలో మారుమూల ప్రాంతంలో కూడా ఎకరం అమ్మితే రూ.50 లక్షలు వస్తుందని, కానీ నేడు ఏపీలో 10 ఎకరాలు అమ్మినా ఆ సొమ్ము వచ్చే పరిస్థితి లేదు అన్నారు. ఒక కియా పరిశ్రమ తెస్తే అక్కడ భూముల రేట్లు పెరిగాయి, సంపద సృష్టి అంటే ఇదే కదా అని వ్యాఖ్యానించారు. ఒక మూర్ఖుడి నిర్ణయానికి తెలుగు జాతి బలి అవ్వాలా? దీనిపై జనం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. తాను ఈ వ్యాఖ్యలు జగన్‌పై ఉక్రోషంతో చేయడం లేదని, జరుగుతున్న నష్టం వల్ల అవేదనతో అంటున్నాను అని చంద్రబాబు అన్నారు. 

పోలవరం పాపం జగన్ దే..

రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును జగన్ తన అసమర్థతతో నాశనం చేశారని చంద్రబాబు నాయడు అన్నారు. పోలవరం పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీరు అందేదని అన్నారు. నదుల అనుసంధానంలో భాగంగా తాను ప్రతిపాదించిన ప్రణాళికను చేపట్టి ఉంటే నీటి కరువు అనేది ఉండేది కాదని అన్నారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి, నీటిని నింపి ఉంటే వర్షాభావాన్ని సులభంగా అధిగమించవచ్చని అన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకుందని, ఏపీ మాత్రం పోలవరాన్ని పూర్తి చేయలేకపోయిందని అన్నారు.

జగన్ తాజా దోపిడీ అనంతపురం లేపాక్షి హబ్
జగన్ దోపిడికీ హద్దే లేకుండా పోతోందని, ఇసుక, మద్యం, గనులు దోచుకుంటున్నా జగన్‌కు చాలలేదని చంద్రబాబు దుయ్యబ్టటారు. కృష్ణపట్నం, గంగవరం, దస్ పల్లా భూములు, ఇలా అన్నింటిలోను జగన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇది చాలదన్నట్లు 8 వేల ఎకరాల లేపాక్షి భూములను మింగేశాడని మండిపడ్డారు. బెంగుళూరు ఎయిర్ పోర్టుకు దగ్గర్లో 8 వేల ఎకరాలు అంటే కనీసం 10 నుంచి 20 వేల కోట్ల రూపాయాల ఆస్తి అని అన్నారు. ఈ స్థాయి అవినీతికి పాల్పడ్డవారిని మీడియా కూడా గట్టిగా ప్రశ్నించాలని అన్నారు. 

సవాళ్లను అధిగమించి సంపద సృష్టిస్తాం..సంక్షేమం చేస్తాం!
వైసీపీ ప్రభుత్వ విధ్వంసం కారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సవాళ్లు ఉంటాయని, అయితే తనకు ఉన్న బ్రాండ్ తో, పాలసీలతో వేగంగా సంపద సృష్టి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. తద్వారా మెరుగ్గా సంక్షేమ పథకాలు అందిస్తాం అన్నారు. సోలార్ విద్యుత్ ను సమర్థవంతంగా వినియోగించుకుంటే...విద్యుత్ చార్జీలను తగ్గించవచ్చని తాను గతంలో ప్రణాళికలు రచించి..వాటిని అమలు చేశానని అన్నారు. అందుకే గత ఐదేళ్ల పాలనలో తాము విద్యుత్ చార్జీలు పెంచలేదు అని చెప్పారు. 

ఇప్పుడు 50 వేల కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీల భారం పడడానికి కారణం జగన్ ప్రభుత్వ విధానాలు కాదా అని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు. సోలార్ ఎనర్జీ విషయంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సూచనలకు అనుగుణంగానే తాను సోలార్ విద్యుత్ ను గత ప్రభుత్వ హయాంలో ప్రొత్సహించినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ వస్తే.....విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని తెలిపారు.

మహిళల జీవితాలు మార్చేలా మహాశక్తి
మహానాడులో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బస్సు యాత్ర నడుస్తోందని, మహిళలకు ప్రకటించిన పథకాలపై ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈనెల 14వ తేదీన పార్టీ కార్యాలయంలో మహాశక్తి కార్యక్రమంపై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. బస్సులు, కార్ల ద్వారా మహిళా నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు పర్యటనలు చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా వేలాది గ్రామాల్లో డోర్ టు డోర్ ప్రచారం ఉంటుందని చెప్పారు. 

అన్ని అంశాలు చర్చించి మహిళలకు సంబంధించి తల్లికి వందనం, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆడబిడ్డ పథకం కింద నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాలు ప్రకటించినట్లు తెలిపారు. ఇవి మహిళల జీవితాల్లో, వారి కుటుంబాల్లో పెనుమార్పులు తెస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయా పథకాల అమలు ప్రభావాన్ని, ఫలితాలను వివరించారు. మహిళలకు ఇప్పుడు ప్రకటించిన పథకాలే కాకుండా...ఇంకా ఏం చేయవచ్చు అనే విషయంలో కూడా ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. దసరా రోజున పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. 

పెద్ద నోట్ల రద్దు జరగాలి
ఎన్నికల్లో నోట్ల పంపిణీకి, అక్రమాలకు చెక్ పెట్టాలి అంటే పెద్ద నోట్ల రద్దు జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉంటున్నాయి అని ప్రశ్నించారు. జగన్ లాంటి వాళ్లను అడ్డుకోవాలి అంటే ఈ తరహా సంస్కరణలు రావాలని అన్నారు.

దొంగ ఓట్ల పై పోరాటం
రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారంపై పోరాటం తీవ్రతరం చేస్తామని అన్నారు. దొంగ ఓట్లపై కూడా వైసీపీ ఎదురు దాడి చేస్తోందని, ఆ పార్టీకి అది ఒక్కటే తెలుసని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ విషయంలో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వదిలేది లేదన్నారు. ఓట్ల అక్రమాలను అడ్డుకోలేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తన నిబద్దతను కోల్పోతుందని చెప్పారు.

పద్మవిభూషణ్ కు ఇచ్చే గౌరవం ఇదేనా?

జగన్ తనను ప్రశ్నించేవారిపై దాడులు చేయడమే విధానంగా పెట్టుకున్నారని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి దాడి చేస్తున్నారని, తాను అడిగితే కూడా అదే తీరున వ్యవహరించారని అన్నారు. తాను అడిగాననే ప్రజావేదిక కూల్చివేశారని, తాను ఉంటున్నానని అద్దె ఇంటిపై అవినీతి ఆరోపణలు చేసి తనకు మరక అంటించే ప్రయత్నం చేశారని అన్నారు. 

ప్రభుత్వ వైఫల్యాలను మీడియా సంస్థగా ఈనాడు ప్రశ్నిస్తోందనే అక్కసుతో మార్గదర్శిపై కేసులు పెట్టారని అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులకు నోటీసులు ఇవ్వడంపై ఆయన మండి పడ్డారు. అసలు వారిని ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. పద్మవిభూషణ్ రామోజీ రావు వంటి వారిని గౌరవించుకునే విధానం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. తన వేధింపులకు సహకరించాలని అధికారులపై జగన్ ఒత్తిడి తెస్తున్నారని, ఇందులో భాగంగానే సీఐడీ చీఫ్ సంజయ్ అనారోగ్యం పాలయ్యారని అన్నారు. అధికారులు భయంతో నిబంధనలకు విరుద్ధంగా జగన్ కోసం పనిచేస్తున్నారని అన్నారు.

దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ చిట్‌చాట్‌లో మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీడియా భాగస్వామ్యం ఎంతో ఉంటుందని గుర్తు చేశారు. మీడియా వాళ్ళు కేసులకో, ఒత్తిళ్లకో భయపడితే, రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

More Telugu News