Andhra Pradesh: వచ్చే నెలలో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్

  • కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించిన మంత్రి బొత్స
  • ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై దృష్టిసారించినట్లు వెల్లడి
  • బదిలీలకు పారదర్శక విధానం తీసుకొస్తామన్న మంత్రి
AP Govt will release DSC Notification 2023 in August

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వచ్చే నెల (ఆగస్టు) లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలు పెట్టినట్లు వివరించారు. నోటిఫికేషన్ నుంచి భర్తీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ లోపరహితంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు చోటివ్వకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ గత ఏప్రిల్ లోనే పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా టీచర్ల బదిలీలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం పారదర్శక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాలను కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

More Telugu News