Kottu Sat5hyanarayana: పవన్ కల్యాణ్ కు ఈ విషయం తెలియదేమో!: మంత్రి కొట్టు సత్యనారాయణ

  • ఏపీ వాలంటీర్ వ్యవస్థపై ధ్వజమెత్తిన పవన్
  • వాలంటీర్లలో 75 శాతం మహిళలే ఉన్నారన్న మంత్రి కొట్టు
  • పవన్ కు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఎలా వచ్చిందో తెలియదని వెల్లడి
  • బహుశా బాబు నుంచి వచ్చిన రిపోర్ట్ అయ్యుంటుందని ఎద్దేవా
Kottu Sathyanarayana counters Pawan Kalyan comments on volunteer system

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల చిచ్చు ఇప్పట్లో చల్లారేట్టు కనిపించడంలేదు. అమ్మాయిల అక్రమ రవాణాకు పరోక్షంగా వాలంటీర్లు కారణమవుతున్నారన్న పవన్ వ్యాఖ్యలు వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. 

పవన్ వ్యాఖ్యల పట్ల ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ కు ఎన్సీఆర్బీ (NCRB) రిపోర్ట్ ఎలా వచ్చిందో తెలియదని అన్నారు. బహుశా చంద్రబాబు నుంచి పవన్ కు రిపోర్ట్ అందిందేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వాలంటీర్ల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించామని స్పష్టం చేశారు. 

"వాలంటీర్లు ఏమైనా పాకిస్థాన్ వాళ్లా? ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించాం. స్థానికులనే వాలంటీర్ గా నియమించాం. వాలంటీర్ల నియామకంలో సామాజిక న్యాయం పాటించాం. ఇవేవీ తెలియకుండా పవన్ కల్యాణ్ ఒక అజ్ఞానవాసిలా మాట్లాడుతున్నారు. 

ఈ ప్రపంచంలో 2 లక్షల పుస్తకాలు చదివిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణే! పవన్ కల్యాణ్ కు తెలియని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాలంటీర్లలో 75 శాతం మహిళలే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర" అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

More Telugu News