Kotamreddy Sridhar Reddy: లోకేశ్ ఆ మాట అంటాడని వాళ్లెవరూ ఊహించలేదు: కోటంరెడ్డి

  • ఓ టీవీ చానల్ చర్చ కార్యక్రమంలో కోటంరెడ్డి వ్యాఖ్యలు
  • సాక్షి మాజీ విలేకరులతో లోకేశ్ ను కలిశారని వెల్లడి
  • లోకేశ్ వారితో ఏం చెప్పాడో ఆ మాటలను వివరించిన కోటంరెడ్డి
  • తాను కూడా ఎంతో ఆశ్చర్యపోయినట్టు వివరణ
Kotamreddy reveals what he spoke to journalists

వైసీపీ రెబెల్ ఎంపీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ టీవీ చానల్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ, టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ గొప్పదనం గురించి, ఆయన ఆలోచన విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎవరికీ తెలియని ఓ అంశాన్ని కోటంరెడ్డి వెల్లడించారు. 

"కొందరు ప్రముఖ పాత్రికేయులు గతంలో సాక్షిలో పనిచేశారు. వారు ఇప్పుడు సాక్షిలో లేరు. వారిలో కొందరు సర్వే సంస్థలు పెట్టుకున్నారు. ఆ పాత్రికేయుల్లో కొందరు రాష్ట్రంలో చాలామందికి తెలిసినవారే. 

పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ ను కలవాలంటూ వారు ఫోన్ చేశారు. లోకేశ్ పాదయాత్ర అప్పుడు అనంతపురంలో ఉంది. దాంతో, తనను అనంతపురంలో కలవాలంటూ ఆ పాత్రికేయులకు లోకేశ్ బదులిచ్చారు. లోకేశ్ సమ్మతించడంతో వారు అనంతపురం వచ్చి ఆయనను కలిశారు. 

మీరు పాదయాత్రలో ఎంతో కష్టపడుతున్నారంటూ వారు లోకేశ్ తో అన్నారు. అందుకు లోకేశ్ ఏం చెప్పారో తెలుసా... లోకేశ్ ఆ మాట అంటాడని ఎవరూ ఊహించి ఉండరు. 

నేను చేసేది పాదయాత్ర కాదండీ... అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు చేశారు చూడండి... అవండీ పాదయాత్రలంటే... ఆ వయసులో వారు వేల కిలోమీటర్లు నడవడం మామూలు విషయం కాదు.... విభిన్న పరిస్థితుల్లో వారు చేసిన పాదయాత్రలు చాలా గొప్పవి... వారి పాదయాత్రలతో పోల్చుకుంటే నేను చేసే పాదయాత్ర ఎంత? అని లోకేశ్ వారితో అన్నారు. 

లోకేశ్ ను కలిసిన సాక్షి మాజీ పాత్రికేయుల్లో నా ప్రాణ స్నేహితుడు ఒకతను ఉన్నారు. ఆ వ్యక్తే నాకు ఈ విషయాలు చెప్పారు. లోకేశ్ గారిలో ఇంత డెప్త్ ఉందని నాకు తెలియదు అని ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఆశ్చర్యపోయారు. మేమంతా సాక్షిలో పనిచేసినవాళ్లం, వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాళ్లం... కానీ మమ్మల్ని అందరినీ అన్నా అన్నా అంటూ లోకేశ్ మాతో గంట సేపు మాట్లాడాడు అని ఆ వ్యక్తి చెప్పారు" అని కోటంరెడ్డి వివరించారు. 

ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో లోకేశ్ గురించి ఎక్కువగా చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుందని, కానీ లోకేశ్ లో ఉన్న పరిణతి అమోఘం అని కోటంరెడ్డి కొనియాడారు. 

"మేం కూడా గ్రామాల్లో పాదయాత్రలు చేస్తుంటాం. ఇంటింటికీ తిరుగుతుంటాం. ఏదో ఒక సమయంలో మాకు కూడా విసుగు కలుగుతుంది. కానీ లోకేశ్ అలా కాదు... జనంతో మాట్లాడుతుంటారు, జనంతో ఫొటోలు దిగుతుంటారు, వాళ్లతో కరచాలనం చేస్తుంటారు, మరోవైపు కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతుంటారు... ఎక్కడా అలసట, విసుగు అనేవి ఉండవు. 

ఆయన క్యాంప్ సైట్ కు వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంటుంది... అయినప్పటికీ వెంటనే టెంట్ లోకి వెళ్లకుండా, క్యాంప్ సైట్ వెలుపల అరగంట సేపు అందరినీ పేరుపేరునా పలకరిస్తూ మాట్లాడుతుంటారు. నాకు లోకేశ్ తో పరిచయం తక్కువ. కానీ లోకేశ్ ను చూసిన తర్వాత నాకు గొప్ప సంతోషం కలుగుతోంది. తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి మరో 30-35 ఏళ్ల పాటు నాయకత్వ సమస్య లేనే లేదు" అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

More Telugu News