Nara Lokesh: ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా జగన్ మోహన్ రెడ్డీ?: లోకేశ్

  • నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • బంగారుపాలెంలో బీసీలతో సమావేశం
  • జగన్ సర్కారు బీసీలను పెట్రోల్ పోసి తగలబెడుతోందని వ్యాఖ్యలు
  • టీడీపీ పాలనలోనే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం అని స్పష్టీకరణ
Lokesh asks CM Jagan if he done any good to people

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. 151వ రోజు యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. మత్స్యకార గ్రామాల్లో యువనేత లోకేశ్ కు అపూర్వ స్వాగతం లభించించి. 

కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె వద్ద చిప్పలేరు బ్రిడ్జిపై యువనేతకు అక్కడి ప్రజలు వినూత్నరీతిలో స్వాగతం పలికారు. ఈ గ్రామంలోని మత్స్యకారులు లోకేశ్ కు స్వాగతం పలుకుతూ బోట్లపై యువగళం జెండాలను ప్రదర్శించారు. 

అంతకుముందు జువ్వలదిన్నెలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనాన్ని లోకేశ్ సందర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలిసి ముచ్చటించారు. 

ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా జగన్?

చిప్పలేరు వంతెన వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "ఇది మద్రాసు-కలకత్తా రహదారి నుంచి కావలి నియోజకవర్గం ఎస్వీ పాలెం మీదుగా జువ్వలదిన్నె వెళ్లే రహదారిలో చిప్పలేరు వాగుపై నిర్మించిన వంతెన. 

గత టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.25.30 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిని 11-1-2019న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అందినకాడికి దోచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ఒక్క పనైనా చేశావా జగన్మోహన్ రెడ్డీ" అంటూ చురకలంటించారు.

బీసీలను పెట్రోలు పోసి తగులబెడుతున్న జగన్ ప్రభుత్వం

బీసీలను జగన్ ప్రభుత్వం పెట్రోల్ పోసి తగలబెడుతోందని నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ 15 ఏళ్ల అమర్నాథ్ గౌడ్ ని కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆరోపించారు. బీసీ కుర్రాడిని పాశవికంగా చంపేసి లక్ష రూపాయలు రేటు కట్టారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కావలి నియోజకవర్గం బంగారుపాలెంలో బీసీలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచింది టీడీపీ అని స్పష్టం చేశారు. 

"కనీసం అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ కి మనస్సు రాలేదు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16,500 మంది బీసీలను పదవులకు దూరం చేశాడు జగన్" అని లోకేశ్ వివరించారు.

టీడీపీ పాలనలోనే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం

బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం ఇచ్చింది టీడీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది టీడీపీ. ఆదరణ పథకం ప్రవేశ పెట్టింది టీడీపీ. బీసీ సబ్ ప్లాన్, కార్పొరేషన్ ద్వారా బీసీలకు రుణాలు ఇచ్చింది టీడీపీ. రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను ఆదుకుంది టీడీపీ. టీడీపీ హయాంలో కీలక పోస్టులు అన్ని బీసీలకే ఇచ్చాం. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు.

జగన్ పాలనలో బీసీలపై దాడులు పెరిగాయి! 

జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలపై దాడులు పెరిగిపోయాయి. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అందుకే బీసీల రక్షణ కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 

రజకులకు ఉచిత విద్యుత్ అందజేస్తాం!

రజక సామాజిక వర్గంకి చెందిన వ్యక్తిని శాసన మండలికి పంపింది టీడీపీ. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రజక సామాజిక వర్గానికి ఐరన్ బాక్సులు, వాషింగ్ మెషిన్లు ఇచ్చాం... ధోబి ఘాట్స్ ఏర్పాటు చేశాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులకి ఉచితంగా విద్యుత్ అందజేస్తాం. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులను ఆదుకుంటాం. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ కూడా అందించాం. వలలు, బోట్లు సబ్సిడీలో అందించాం. వేట విరామ సాయం అందించాం. డీజిల్ సబ్సిడీలో అందించాం. 

లోకేశ్ ను కలిసిన ఎన్టీఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులు

ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిన 35 మంది పూర్వ విద్యార్థులు యువనేత నారా లోకేశ్ ను కలిశారు. కావలి నియోజకవర్గం బంగారుపాలెం క్యాంప్ సైట్ లో ఆదివారం కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్, వివిధ రంగాల్లో స్థిరపడిన వారిని లోకేశ్ అభినందించారు. 

పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... తల్లిదండ్రులను కోల్పోయిన తమను ఎన్టీఆర్ మోడల్ స్కూలు అమ్మలా అక్కున చేర్చుకుందని తెలిపారు. మంచి హాస్టల్ తో పాటు, కార్పొరేట్ స్థాయి విద్యను ఎన్టీఆర్ మోడల్ స్కూల్ తమకు అందించడంతో ఇప్పుడు జీవితంలో సెటిలయ్యామని అన్నారు. ఈరోజు మెరుగైన జీతాలు అందుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివే వారిలో 80 శాతం మంది ఐఐటీ, నీట్ లో ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు. మరికొందరు క్యాంపస్ సెలక్షన్లలో ఎంపికై విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. 

భవిష్యత్ లో మరింత ఉన్నత స్థానానికి చేరుకొని, మీలాంటి మరికొందరికి చేయూత నందించాలని లోకేశ్ పేర్కొన్నారు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1983.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 14.6 కి.మీ.*

*152వ రోజు పాదయాత్ర వివరాలు (10-7-2023):*

*కావలి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)*

ఉదయం

8.00 – తుమ్మలపెంట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.10 – తుమ్మలపెంట జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

9.10 – మన్నంగిదిన్నెలో స్థానికులతో సమావేశం.

10.25 – కోనదిన్నెలో స్థానికులతో సమావేశం.

11.30 – ఆముదాలదిన్నెలో భోజన విరామం.

మధ్యాహ్నం

3.00 – ఆముదాలదిన్నెనుంచి పాదయాత్ర కొనసాగింపు.

3.05 – కావలి అంబేద్కర్ నగర్ లో ఎస్సీలతో సమావేశం.

3.30 – కావలి పోలేరమ్మ గుడి వద్ద స్థానికులతో సమావేశం.

సాయంత్రం 

4.00 – కావలి బిపిఎస్ సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.15 – కావలి వలికుంటపురం సర్కిల్ లో స్థానికులతో సమావేశం.

7.45 – శ్రీపురం చెలించర్ల క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

7.50 – శ్రీపురం క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.

******

More Telugu News