anam venkataramana reddy: తప్పుడు ప్రమాణాలు చేసిన ఎమ్మెల్యే అనిల్‌ను భగవంతుడు క్షమించాలి: ఆనం వెంకటరమణారెడ్డి

  • అనిల్ తన ఆస్తులపై అబద్ధాలతో దేవుని ఎదుట ప్రమాణం చేశారన్న ఆనం
  • దొంగ ప్రమాణాలు ఎవరి కోసమని ప్రశ్న
  • అనిల్‌కు ఇంటర్నేషనల్‌ నోటీసులు ఎందుకొచ్చాయని నిలదీత
anam venkataramana reddy press meet

మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన ఆస్తులపై పచ్చి అబద్ధాలతో దేవుని ఎదుట ప్రమాణం చేశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ‘‘ఆస్తి పత్రాల్లో ఉన్న చిరంజీవి ఎవరు? మీ పీఏ నాగరాజు సాక్షి సంతకం ఎందుకు పెట్టారు? కూల్ డ్రింక్ షాపు యజమాని పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయి” అని ప్రశ్నించారు.

నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి, నాగరాజు, కూల్ డ్రింక్ యజమాని.. మీ మనుషులు కాదా? అని నిలదీశారు. తప్పుడు ప్రమాణాలు చేసిన అనిల్‌ను భగవంతుడు క్షమించాలని ఆనం అన్నారు. దొంగ ప్రమాణాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. దేవుళ్లపై, పిల్లలుపై ప్రమాణాలు ఎందుకని, తన మీద తానే ప్రమాణం చేసుకోవాలని అన్నారు.

2017 ఆగస్టులో క్రికెట్ బెట్టింగ్‌ కేసులో అనిల్‌ను ఎందుకు విచారించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బెట్టింగ్‌కు సంబంధం లేదని అంటున్న అనిల్, ఇటీవల తన బాబాయ్ పాపం మోస్తున్నానని చెప్పారని, వాస్తవానికి బాబాయ్, అబ్బాయ్ కలిసే ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ‘బెట్టింగ్ మా బాబాయ్ పనేనని’ పోలీసు విచారణలో ఎందుకు చెప్పలేదన్నారు.

‘‘అనిల్‌కు ఇంటర్నేషనల్‌ నోటీసులు ఎందుకొచ్చాయి? పెరూలో బంగారు వ్యాపారం ఉందో, లేదో బయటపెట్టాలి. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి. ముదివర్తిపాళెం కాజ్ వే పనులకు ప్రసన్న వర్గీయులు దొంగ బ్యాంకు గ్యారంటీతో టెండర్లు వేసింది వాస్తవం కాదా?” అని ఆనం ప్రశ్నించారు.

More Telugu News