Chiranjeevi: 'భోళా శంకర్' నుంచి మరో అప్ డేట్ ఇచ్చిన చిరంజీవి

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'భోళా శంకర్'
  • ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిత్రం
  • హీరోయిన్ గా తమన్నా... చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తిసురేశ్
  • ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'భోళా శంకర్'
Megastar Chiranjeevi said they wraps up Bhola Shankar dubbing

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'భోళా శంకర్' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కాగా, ఈ చిత్రంపై చిరంజీవి అప్ డేట్ అందించారు. 'భోళా శంకర్' డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సినిమా రూపుదిద్దుకున్న విధానం చాలా సంతృప్తి కలిగించిందని వెల్లడించారు. 

ఈ సినిమా మాస్ విశ్వరూపం ప్రదర్శించడం ఖాయమని, ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తుందని చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని, విడుదల తేదీని రౌండప్ చేసుకోవాలని సూచించారు. థియేటర్లలో కలుసుకుందాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తుండడం విశేషం. సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మి గౌతమ్, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర 'భోళా శంకర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మాస్ మెగా ఎంటర్టయినర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News