ఇలా చేస్తే రూ.15కే లీటర్ పెట్రోల్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

  • రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘడ్ నగరంలో మంగళవారం వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన గడ్కరీ 
  • అనంతరం, సభలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగం
  • రవాణాకు సగటున 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్ వాడితే పెట్రోల్ ధరలు దిగొస్తాయని వెల్లడి
  • పెట్రోల్ ఏకంగా రూ.15కు దిగొస్తుందని వ్యాఖ్య
  • రైతులు అన్నదాతలే కాదు శక్తి దాతలని కూడా తమ ప్రభుత్వం భావిస్తోందని వెల్లడి
దేశంలో పెట్రోలు ధరలు తగ్గించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సృజనాత్మక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. దేశంలో రవాణా అవసరాలకు సగటున 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్ వినియోగిస్తే పెట్రోలు లీటరు ధర రూ.15కు చేరుకుంటుందని, అంతిమంగా ఇది సామాన్యులకు లాభిస్తుందని చెప్పారు. రాజస్థాన్‌లో ప్రతాప్‌ఘడ్‌ నగరంలో మంగళవారం జరిగిన ఓ సభలో మంత్రి ప్రసంగించారు. తమ ప్రభుత్వ విధానాల గురించి పలు కీలక వివరాలు వెల్లడించారు. 

‘‘రైతులు కేవలం అన్నదాతలే కాదు, శక్తిదాతలు కూడా కాగలరని మా ప్రభుత్వం నమ్ముతోంది. త్వరలో దేశంలోని వాహనాలు 60 శాతం ఇథనాల్‌ కలిగిన ఇంధనంతో పరుగులు పెడతాయి. మరో 40 శాతం రవాణా ఖర్చుకు విద్యుత్ కూడా జతచేస్తే దేశంలో పెట్రోల్ సగటున లీటరు రూ.15కే లభిస్తుంది. ఇది సామాన్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

ఇథనాల్ ఆధారిత ఇంధనంతో కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన దిగుమతులు కూడా తగ్గుతాయని చెప్పారు. దిగుమతులపై ప్రస్తుతం ఖర్చు చేస్తున్న రూ.16 లక్షల కోట్లను రైతు శ్రేయస్సు కోసం వినియోగించవచ్చని చెప్పారు. అంతకుమునుపు, నితిన్ గడ్కరీ ప్రతాప్‌ఘడ్‌లో రూ. 5600 కోట్లతో చేపట్టనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

Nitin Gadkari
Rajasthan
Fuel prices
BJP
India

More Telugu News