అజిత్ పవార్ అటు వైపు వెళ్లడం వెనుక శరద్ పవార్ ఆశీస్సులున్నాయి: రాజ్ థాకరే

  • రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అసహ్యమేస్తున్నాయన్న రాజ్  
  • అజిత్, పటేల్ తదితరులు శరద్ ఆశీస్సులు లేకుండా ముందుకెళ్లరని వ్యాఖ్య
  • ఇలాంటి రాజకీయాలు పవార్ తో ప్రారంభమై, ఆయనతోనే ముగిశాయన్న రాజ్
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు స్వయంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆశీస్సులు ఉండవచ్చునని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ థాకరే మంగళవారం అన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీని చీల్చి, రాష్ట్రంలోని శివసేన-బీజేపీ ప్రభుత్వంలో ఆదివారం ఎన్సీపీ నేత అజిత్ పవార్ చేరడంపై రాజ్ థాకరే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అసహ్యమేస్తున్నాయన్నారు. ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడమే తప్ప మరొకటి కాదన్నారు. అజిత్ పవార్ తో పాటు ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే, పాటిల్, చగన్ భుజ్ భల్ వంటి నేతలు శరద్ పవార్ ఆశీస్సులు లేకుండా ముందుకు వెళ్లరన్నారు.

రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలకు శ్రీకారం చుట్టిందే శ‌ర‌ద్ ప‌వార్‌ అని ఆరోపించారు. 1978లో నాటి వ‌సంత‌దాదా పాటిల్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ప‌వార్ చీల్చారని, పురోగామి లోక్‌సాహి దళ్ (పులోద్‌) ప్ర‌భుత్వానికి తొలిసారి శ‌ర‌ద్ ప‌వార్ మ‌ద్ద‌తు ప్రకటించారని గుర్తు చేశారు. అంత‌కుముందు ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ప‌వార్‌తో ప్రారంభమైన ఈ రాజకీయాలు... ఆయనతోనే ముగిశాయన్నారు.


More Telugu News

Raj Thackeray Sharad Pawar ajit pawar Maharashtra