Sharad Pawar: మీకు 83 ఏళ్లు.. రిటైర్ అవుతారా?.. లేదా?: శరద్ పవార్‌కు అజిత్ పవార్ సూటి ప్రశ్న

Sharad Pawar is our inspiration says Ajit Pawar
షార్ట్స్‌లో చూడండి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం తర్వాత ఆ పార్టీలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. తమదే అసలైన పార్టీ అని, తమ వెంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు పోటాపోటీగా బలప్రదర్శన చేశాయి. ఈ క్రమంలో ముంబైలోని బాంద్రాలో ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ సమావేశం కాగా, 35 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉండగా, ఐదుగురు భేటీకి హాజరయ్యారు. 

మరోపక్క, ముంబై నారీమన్ పాయింట్ లో సమావేశమైన శరద్ పవార్ వర్గం భేటీకి 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్ వర్గం ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. కొంతమంది అజిత్ పవార్ పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీజేపీ - ఏక్ నాథ్ షిండే శివసేన కూటమిలో తాము ఎన్సీపీ పార్టీగానే చేరామన్నారు. తమది తిరుగుబాటు కాదన్నారు. తాను ఎప్పుడూ శరద్ పవార్ వెంటే ఉన్నానని, ఇప్పుడు కూడా ఆయన ఆశీస్సులు కోరుకుంటున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం తాము శివసేన-బీజేపీ కూటమిలో చేరామన్నారు.

ఆ తర్వాత అజిత్ పవార్ మాట్లాడుతూ... శరద్ పవార్ తమకు స్పూర్తి అన్నారు. సోనియాగాంధీని ఎదిరించిన నేత శరద్ పవార్ అని ప్రశంసించారు. శరద్ పవార్ నాయకత్వంలో పని చేశానని, ఆయన నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.  ప్రభుత్వంలో ఏ పదవినైనా నిర్వహించే సామర్థ్యం తమకు (ఎన్సీపీకి) ఉందన్నారు. ఎన్సీపీ అంటేనే అభివృద్ధి అన్నారు. 2004లో కాంగ్రెస్ కంటే ఎన్సీపీకి ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠం మాత్రం తమ పార్టీ కోల్పోయిందన్నారు. ప్రధాని మోదీకి ప్రజల నుండి అపూర్వమైన మద్దతు ఉందని, ఆయనకు భారత్ ఓటు వేస్తోందని ప్రశంసించారు. తాను ఎప్పుడూ కుటుంబ రాజకీయాలు చేయలేదన్నారు. మహారాష్ట్ర దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగానే ఉండాలన్నారు. ఎన్సీపీ నాయకత్వంలో ఛగన్ భుజ్ లాల్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. 

2019లో శివసేనతో ప్రభుత్వాన్ని శరద్ పవార్ కోరుకోలేదని, అందుకే తమ పార్టీ అధినేత బీజేపీ అధిష్ఠానాన్ని కలిశారని చెప్పారు. 2017లోను వర్ష బంగ్లాలో బీజేపీ పెద్దలను కలిశారని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు కొంతమంది ఈ సమావేశానికి రాలేదని తెలిపారు. బీజేపీలో 75 ఏళ్లకు నేతలు రిటైర్ అవుతుంటారు. దీనిని ఉటంకిస్తూ, శరద్ ను ఉద్దేశించి అజిత్ పవార్ మాట్లాడుతూ.. 'మీకు 83 ఏళ్లున్నాయి, మీరు రిటైర్ అవుతున్నారా? లేదా?' చెప్పాలని ప్రశ్నించారు.
Go Back to Shorts
Sharad Pawar
ajit pawar
Maharashtra

More Telugu News