kodi kathi: జగన్ పై దాడి కేసు: బెయిల్ అంశం తమ పరిధిలో లేదన్న ఎన్‌ఐఏ కోర్టు.. సుప్రీంకు వెళ్లాలని నిందితుడికి సూచన

  • బెయిల్ ఇవ్వాలంటూ ఎన్‌ఐఏ కోర్టులో నిందితుడు శ్రీనివాస్ పిటిషన్  
  • తదుపరి విచారణ ఈ నెల 11 కు వాయిదా 
  • కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే దీక్ష చేస్తానన్న శ్రీను
kodikathi srinu will start protest

నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ ఇచ్చే అంశం తమ పరిధిలో లేదని ఎన్‌ఐఏ కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. కోడికత్తి కేసుపై విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.

తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ కోర్టును నిందితుడు శ్రీనివాస్ అభ్యర్థించడంతో ఈ మేరకు సుప్రీం ముందుకు వెళ్లాలని కోర్టు చెప్పింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. 
నిజానికి గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్‌ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది.  

ఇదిలా ఉండగా.. కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే దీక్ష చేపడతానని నిందితుడు శ్రీనివాసరావు చెప్పాడు. ఈనెల 11 నుంచి దీక్ష చేస్తానని హెచ్చరించాడు. శ్రీను తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో ఐదు సంవత్సరాల నుంచి శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడు. అతడికి కోర్టు రెగ్యులర్ షెడ్యూల్‌ను ప్రకటించాలి” అని కోరారు. రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకపోతే శ్రీనివాస్ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడని వెల్లడించారు.

More Telugu News