Chegondi Hari Rama Jogaiah: మీ నాన్నగారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోంది!: జగన్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ

  • చట్టపరంగా పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా.. ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకన్న జోగయ్య 
  • కేసీఆర్ దత్తపుత్రుడిగా మీరు ప్యాకేజీ తీసుకోలేదా? అని నిలదీసిన వైనం
  • మీ కుటుంబంలో అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటేనని విమర్శ
  • మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా? అని ప్రశ్న
Hari Rama Jogaiah letter to Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ, మాజీ హోం మంత్రి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదనిపిస్తోందని... అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ నాన్నగారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని... తొలుత ఆయనను విమర్శించినా, ఆ తర్వాత ఆయన అభిమానిగా మారానని చెప్పారు. ప్రతిపక్ష నాయకులపై అప్పుడప్పుడు ఆయన చేసే విమర్శలు ఎంత హుందాగా ఉండేవో ప్రజలందరికీ తెలుసని అన్నారు. 

"ప్రజల ఆరాధ్య నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు పవన్ కల్యాణ్ పట్ల మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను విన్నాక మిమ్మల్ని సినిమాల్లోని విలన్ పాత్రధారిగా వర్ణించబోవచ్చేమో అనిపిస్తోంది. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ప్రజలకు లేని అభ్యంతరం మీకెందుకు? ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయి, చట్టపరంగానే పెళ్లి చేసుకుంటే చట్టపరంగా తప్పేమిటి? ఉంచుకుంటే తప్పు కానీ. పవన్ పై బురద చల్లడానికి మరో కారణాలు లేకే ఇలాంటి చవకబారు కారణాలతోనే లబ్ధి పొందాలని మీరు చూస్తున్నట్టు ఉంది. మరోసారి చవకబారు విమర్శలు చేయక మీ నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. 

మాట్లాడితే పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు, ప్యాకేజీ అంటూ విమర్శిస్తూ ఉంటారు. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దత్తపుత్రుడిగా 2019 ఎన్నికలలో ఓటర్లను కొనుక్కునే నిమిత్తం కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. మీ ఈ చర్యకు మీరు ఓట్లకు నోట్లను ఇవ్వచూపిన ఓటర్లే ఇందుకు సాక్షులు కాదా?

మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి మీ వరకు మీ కుటుంబం అందరికీ దోచుకోవడం, దాచుకోవడం అలవాటే కదా. కాదని చెప్పగల దమ్ముందా మీకు. లేక మీ అందరి అవినీతి చిట్టా అంతా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా?

ఇకముందు ప్రతిపక్ష నాయకులపై ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై అనవసరమైన దుర్భాషలాడటం మానుకుంటే బాగుపడతారు. ఒకటి అని నాలుగు అనిపించుకోవడం ఏ సలహాదారు నేర్పారు మీకు? ఇలాంటి తప్పుడు కూతలు మీతో మాట్లాడించి మిమ్మల్ని ముంచడానికే అనిపిస్తోంది. మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. 

మీపై ఈ అభియోగాలు మోపవలసిన పరిస్థితి నాకు ఏర్పడినందుకు బాధగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి అయింది. ఇది ప్రజాభిప్రాయం కనుక. నాకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు. వాళ్లు అధికార పక్ష నేత అయినా స్వపక్ష నేత అయినా తప్పంటూ ఉంటే వాళ్ల మొహం మీద కుండ బద్దలుకొట్టడం నా నైజం. సారీ" అంటూ తన లేఖలో హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News