Multiplex: పాప్ కార్న్, పెప్సీకి రూ.820...ఇందుకే జనాలు థియేటర్లకు రానిది!

  • నోయిడాలోని ఓ మల్టీప్లెక్స్ లో భారీ రేట్లు 
  • బిల్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన ప్రేక్షకుడు
  • ఒక్క రోజులోనే 16 లక్షల వ్యూస్
  • ఈ మొత్తంతో ప్రైమ్ వీడియో వార్షిక సబ్ స్ర్కిప్షన్ కొనొచ్చని వ్యాఖ్య
Noida Resident Criticises Multiplex Pricey Snacks Bill Pic Goes Viral

ఇది వరకు కొత్త సినిమా చూడాలనుకుంటే ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లేవారు. కుటుంబం, స్నేహితులతో కలిసి వెండితెరపై సినిమా చూసేవారు. కానీ, కరోనా మహమ్మారి తర్వాత, ఓటీటీల రాకతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. కొత్త సినిమాలు కొన్ని వారాల్లోనే ఓటీటీల్లోకి వస్తున్న నేపథ్యంలో జనాలు ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు.  సరదా కోసం కుటుంబ స‌భ్యుల‌తో థియేట‌ర్‌కు వెళ్లే వారికి టికెట్ల కంటే పార్కింగ్, తినుబండారాల రేట్లు షాకిస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో రేట్లు ఎలా ఉన్నాయో చెబుతూ నోయిడాకు చెందిన ఓ వ్యక్తి ట్విట్టర్ లో పంచుకున్న బిల్లు వైరల్ అవుతోంది. 

త్రిదిప్ కే మండ‌ల్ అనే వ్యక్తి నోయిడాలోని ఓ మల్టీప్లెక్స్ లో చీజ్ పాప్‌కార్న్‌, పెప్సీ కొన్నాడు. ట్యాక్సులతో కలిపి 55 గ్రాముల చీజ్ పాప్‌కార్న్‌ కు రూ. 460 బిల్లు వేయ‌గా,  600 ఎంఎల్ కూల్ డ్రింక్‌కు ఏకంగా రూ. 360 చార్జ్ చేశారు. ఇలా రెండింటికే రూ. 820 బిల్లు చూసి ఆ వ్యక్తి అవాక్కయ్యారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వార్షిక స‌బ్‌స్క్రిప్ష‌న్‌కు స‌మాన‌మైన బిల్లు వ‌చ్చింద‌ని, ఇది నోయిడాలోని పీవీఆర్ సినిమాస్‌లో త‌న‌కు ఎదురైన అనుభ‌వ‌మ‌ని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌క‌పోవ‌డంలో ఆశ్చ‌ర్యం లేదన్నాడు. కుటుంబంతో క‌లిసి థియేట‌ర్‌లో సినిమా చూడ‌టం ఇప్పుడు బహు భారంగా మారిందని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌ ను ఏకంగా 16 ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు.

More Telugu News