Diamond Ring: రూ. 50 లక్షల విలువైన వజ్రపుటుంగరం చోరీ.. పోలీసుల భయంతో టాయిలెట్ కమోడ్‌లో పడేసిన యువతి

  • హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఘటన
  • చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ
  • చికిత్స కోసం చేతికున్న ఉంగరం తీసి పక్కన పెట్టిన వైనం
  • ఉంగరాన్ని దొంగిలించిన యువతి అరెస్ట్
Rs 50 Lakh Worth Diamond Throws Into Toilet Commode

రూ. 50 లక్షల విలువైన వజ్రపుటుంగరాన్ని దొంగిలించిన ఓ యువతి ఆ తర్వాత పోలీసుల భయంతో దానిని టాయిలెట్ కమోడ్‌లో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన నరేంద్రకుమార్ కోడలు గత నెల 27న జూబ్లీహిల్స్‌లోని ఎఫ్ఎంఎస్ దంత, చర్మ వైద్యశాలకు వెళ్లారు. చికిత్స సమయంలో చేతికి ఉన్న రూ. 50 లక్షల విలువైన వజ్రపుటుంగరాన్ని పక్కన పెట్టారు. తర్వాత మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు. 

ఆ తర్వాత విషయం గుర్తొచ్చి హడావుడిగా ఆసుపత్రికి వచ్చారు. అక్కడి సిబ్బందిని అడిగినా ఫలితం లేకపోవడంతో నరేంద్రకుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బందిలో ఒకరైన లాలస అనే యువతిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టిష్యూ పేపర్‌లో చుట్టిన ఉంగరాన్ని తన పర్సులో ఎవరో పెట్టారని, తాను భయంతో దానిని టాయిలెట్ కమోడ్‌లో విసిరేశానని తెలిపింది. దీంతో టాయిలెట్ కమోడ్, పైపులైన్లను తొలగించి గాలించగా ఉంగరం దొరికింది. సదరు యువతిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. 

More Telugu News