India: ఫ్రాన్స్ తోనూ అమెరికా తరహా ఒప్పందం... మోదీ పర్యటనకు ముందు కీలక పరిణామం!

  • జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం
  • ప్రత్యేక ఆహ్వానితుడిగా పారిస్ వెళుతున్న ప్రధాని మోదీ
  • ఆధునిక తరం యుద్ధ విమాన ఇంజిన్ టెక్నాలజీ అందించేందుకు ఫ్రాన్స్ అంగీకారం
  • భారత్ కు చెందిన ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఫ్రాన్స్ సంస్థ సఫ్రాన్ భాగస్వామ్యం!
India reportedly ties up with French aircraft engine maker Safran

ఈ నెల 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం జరగనుండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. అయితే మోదీ పర్యటనకు ముందు ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఇటీవలే మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎంతో కీలకమైన జెట్ ఇంజిన్ ఒప్పందం కుదిరింది. 

ఆధునిక యుద్ధ విమానాలకు గుండెకాయ వంటి జీఈ-414 ఇంజిన్లను ఇకపై భారత్ లోనే తయారుచేసేందుకు అవసరమైన టెక్నాలజీని అమెరికా 100 శాతం బదిలీ చేయనుంది. ఇప్పుడు భారత్-ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం కూడా అలాంటిదేనని భావిస్తున్నారు. 

ఫ్రాన్స్ కు చెందిన అగ్రగామి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ సంస్థ సఫ్రాన్... భారత్ చేపడుతున్న అడ్వాన్స్ డ్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టులో పాలుపంచుకోనుంది. ఈ మేరకు సంయుక్త భాగస్వామ్యానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆమోదం తెలిపారు. 

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందే ఈ ఒప్పందం తెరపైకి రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే 100 కేజీల న్యూటన్ ఇంజిన్ పూర్తిగా భారత్ లోనే తయారుకానుంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

More Telugu News