Gujarat: వీధి కుక్కల రాజభోగాలు.. రూ.90 కోట్ల మేర ఆస్తులు

Villagers in gujarat set up trust in the name of street dogs transfer rs 90 crore worth of assets
  • గుజరాత్‌లోని మెహసానా జిల్లా పంచోత్ గ్రామంలో అరుదైన దృశ్యం
  • జంతువులకు సేవ చేస్తే మంచి జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం
  • వీధి కుక్కలకు సేవ చేసి తరించేందుకు నిర్ణయం
  • గ్రామసింహాల కోసం ట్రస్టు ఏర్పాటు చేసి ఆస్తులు రాసిస్తున్న వైనం
  • ట్రస్టులో ఇప్పటికే రూ.90 కోట్ల ఆస్తులు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శునకాలు
ఆ గ్రామంలోని వీధి కుక్కలు కోట్లకు పడగలెత్తాయి. ఏకంగా రూ.90 కోట్ల ఆస్తికి హక్కుదారులయ్యాయి. వాటి ఆస్తి నిర్వహణకు ఓ ట్రస్టు కూడా ఉంది. దీంతో ఆ గ్రామసింహాల లైఫ్‌స్టైలే మారిపోయింది. పెంపుడు కుక్కలు కూడా అసూయ పడేస్థాయిలో అవి రాజభోగాలు అనుభవిస్తున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఇందుకు వేదిక అయ్యింది. 

జంతువులకు సేవ చేస్తే తమకు మంచి జరుగుతుందని జిల్లాలోని పంచోత్ గ్రామ ప్రజల బలమైన విశ్వాసం. దీంతో, నిత్యం కళ్లెదురుగా ఉండే వీధి కుక్కలకే సేవచేయాలని వారు నిర్ణయించుకున్నారు. వాటి కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి భారీ మొత్తాలను విరాళంగా ఇవ్వడం మొదలెట్టారు. కొందరు ఏకంగా కోట్ల రూపాయల విలువైన తమ ఆస్తులనే ఆ ట్రస్టుకు ధారాదత్తం చేశారు. 

ఇక కుక్కల సేవ కోసం భారీ యంత్రాంగమే ఏర్పాటు చేసుకున్నారు. శునకాలకు ఆహారం తయారు చేసేందుకు కొందరు మహిళలను నియమించుకున్నారు. వారు రోజుకు వెయ్యి రొట్టెలు చేస్తారు. వీటిని వలంటీర్లు శునకాలకు ఇస్తుంటారు. శునకాలు అనారోగ్యం పాలైతే వెంటనే వైద్యం అందించేందుకు ఓ పశు వైద్యుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ శునకాలు నిజంగానే లక్కీ కదూ!

More Telugu News

Gujarat