Neeraj Chopra: నీరజ్ మళ్లీ అదరగొట్టాడు.. లుసానె డైమండ్ లీగ్‌లో స్వర్ణ పతకం

  • తొలి ప్రయత్నంలో విఫలమైనా తర్వాత పుంజుకున్న నీరజ్ చోప్రా
  • ఐదో ప్రయత్నంలో 87.66 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలోకి
  • నిరాశపరిచిన లాంగ్‌జంప్ క్రీడాకారుడు మురళీ శ్రీశంకర్
Neeraj Chopra Wins Lausanne Diamond League 2023

నీరజ్ చోప్రా మరోమారు అదరగొట్టాడు. లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో 87.66 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి విజేతగా నిలిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్.. రెండో ప్రయత్నంతో 83.52, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్ల దూరం విసిరాడు. అయితే, నాలుగో ప్రయత్నంలో మళ్లీ విఫలమయ్యాడు. ఐదో ప్రయత్నంలో మాత్రం పుంజుకుని ఏకంగా 87.03 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లి విజేతగా నిలిచాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న నీరజ్ ఈ ఏడాది ఖతర్‌లో జరిగిన దోహా డైమండ్ లీగ్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత కండర గాయంతో ఎఫ్‌బీకే క్రీడలు, పావో నూర్మి ఈవెంట్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ లుసానె డైమండ్ లీగ్‌లో విజేతగా నిలిచాడు. రెండు మూడు స్థానాల్లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వాద్లిచ్ నిలిచారు. ఇక, ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న భారత లాంగ్‌జంప్ క్రీడాకారుడు మురళీ శ్రీశంకర్ ఐదో స్థానంతో సరిపెట్టుకుని నిరుత్సాహపరిచాడు.

More Telugu News