సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసు.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!

  • సుశాంత్‌ మృతిపై సాక్ష్యాలను సేకరించామన్న దేవేంద్ర ఫడ్నవీస్
  • వాటి విశ్వసనీయతను అధికారులు పరిశీలిస్తున్నారని వెల్లడి
  • సీబీఐ దర్యాప్తు ఇంకా కొనాసాగుతోందన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఈ కేసులో తొలుత వాళ్లూవీళ్లు చెప్పిన సమాచారమే ఉందని, ఆ తర్వాత కొంతమంది తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారని తెలిపారు. 

‘‘వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాం. తర్వాత ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. వాటి విశ్వసనీయతను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న ఈ దశలో కేసు గురించి ఇంకేం చేప్పలేను” అని అన్నారు.

2020 జూన్‌లో‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. తొలుత ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇందులో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు సుశాంత్‌ మరణానికి వారం రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు.


More Telugu News

Sushant Singh Rajput Devendra Fadnavis Maharashtra Bollywood