త్వరలో డబుల్ ఇంజిన్ సర్కార్ మాయం: మమతా బెనర్జీ

బీజేపీ దేశాన్ని అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటోందని, కానీ త్వరలో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ మాయమవుతుందన్నారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఇంజిన్ కోల్పోతారని, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ రెండో ఇంజిన్ కూడా కోల్పోతారని విమర్శించారు. తాము బీజేపీ వ్యతిరేక మహా కూటమిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అది త్వరలో సాకారమవుతుందన్నారు.

కాషాయ శిబిరం ఆదేశానుసారం రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను బీఎస్‌ఎఫ్ భయపెడుతోందని మమత ఆరోపించారు. వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించాలని పోలీసు అధికారులను మమత కోరారు. 

పంచాయతీ ఎన్నికలకు ముందు, కొంతమంది BSF అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఓటర్లను బెదిరించి, ఓటు వేయవద్దని బలవంతం చేస్తున్నారని తనకు సమాచారం అందిందని చెప్పారు. వారి వ్యూహాలకు భయపడవద్దని, ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేయమని తాను ప్రజలను కోరుతున్నానని అన్నారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, ఇందులో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదన్నారు.


More Telugu News