Nara Lokesh: చంద్రబాబు చేసింది జగన్ చెయ్యాలంటే నాలుగు జన్మలెత్తాలి: నారా లోకేశ్

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర
  • నాయుడుపేటలో లోకేశ్ బహిరంగ సభ
  • యువగళం పాదయాత్రకు ప్రజాదరణ లభిస్తోందన్న లోకేశ్
  • పిల్ల సైకోలు రోడ్లపైకి వచ్చి మొరుగుతున్నారని వ్యాఖ్యలు
  • నెల్లూరు జిల్లాకు టీడీపీ చేసిన అభివృద్ధిని వివరించిన లోకేశ్
Lokesh slams Jagan in Naidupeta rally

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాడీవేడిగా ప్రసంగించారు. సింహపురిలో తాను సింహంలా అడుగుపెట్టానని వెల్లడించారు. యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి పిల్ల సైకోలు రోడ్లపైకి వచ్చి మొరుగుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. నెల్లూరు జిల్లాకి చంద్రబాబు చేసింది జగన్ చెయ్యాలంటే నాలుగు జన్మలెత్తాలని ఎద్దేవా చేశారు. 

2014 లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకి మూడు సీట్లే ఇచ్చారు... అయినా నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని లోకేశ్ చెప్పారు. ఒక్క నెల్లూరు సిటీని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేశాం... ఇది నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అని అభివర్ణించారు. నెల్లూరు సిటీలో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే... నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ప్రభుత్వం మీది అని వైసీపీ నేతలను విమర్శించారు. 

"ఒక్క నెల్లూరు టౌన్ లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. నెల్లూరు బ్యారేజ్ 90 శాతం, సంగం బ్యారేజ్ 70 శాతం, ఎస్ఎస్ కెనాల్ పనులు ప్రారంభించాం. టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అటవీ అనుమతులు తీసుకొని అదనంగా జిల్లాలో మరో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. 73 పరిశ్రమలు వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. 

గమేషా విండ్ టర్బైన్స్, థర్మల్ పవర్ టెక్, సీపీ ఆక్వాకల్చర్, ఫెడోరా సీ ఫుడ్స్, అంజని టైల్స్, ఇండస్ కాఫీ ప్రై.లి, సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ అండ్ ఫాట్స్ ప్రై.లి, జెల్ కాప్స్ ఇండస్ట్రీస్, యూపీఐ పాలిమర్స్, పిన్నే ఫీడ్స్, బాస్ఫ్ ఇండియా లి., దొడ్ల డెయిరీ, పెన్వేర్ ప్రొడక్ట్స్ ప్రై.లి, అమరావతి టెక్స్ టైల్స్,అరబిందో ఫార్మా, ఓరెన్ హైడ్రోకార్బోన్స్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి" అని లోకేశ్ వివరించారు. 

"2019 లో ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10కి 10 సీట్లు వైసీపీకి ఇచ్చారు. ఆ పది మంది ఎమ్మెల్యేలను అడుగుతున్నా... మీరు చేసిన అభివృద్ది, తెచ్చిన కంపెనీ ఒక్కటి ఉంటే చెప్పండి" అంటూ సవాల్ విసిరారు.

More Telugu News