ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో కలుపు మొక్కలు: అనిల్ కుమార్ యాదవ్

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి దూరమైన ముగ్గురు ఎమ్మెల్యేలు
  • కలుపు మొక్కలు కాబట్టే పీకి పడేశారన్న అనిల్ కుమార్
  • ఆనం వచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని వెల్లడి
  • డిపాజిట్ కూడా రాదని స్పష్టీకరణ
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు సొంత పార్టీపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేయడం తెలిసిందే. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. దీనిపై మాజీ మంత్రి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడినంత మాత్రాన ఏమీ జరగదని అన్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో కలుపు మొక్కల్లాంటివాళ్లని అభివర్ణించారు. అందుకనే వాళ్లను పీకి పడేశారని వ్యాఖ్యానించారు. 

ఆనం రామనారాయణరెడ్డి ఎక్కడ గాలి వీస్తుంటే అక్కడికి వెళతాడని, గతంలో ఆయన ఐదేళ్లు మంత్రిగా ఉండి ఏం సాధించారని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. సంగం బ్యారేజి పనులు పూర్తి కాలేదని, అల్తూరుపాడు రిజర్వాయర్ పనులను ఆనం అడ్డుకున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆనం గెలవడం అసాధ్యమని, ఆనం మళ్లీ టీడీపీని వదిలేస్తాడని అనిల్ జోస్యం చెప్పారు. ఆనం ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదని అన్నారు.


More Telugu News

Anil Kumar Yadav Anam Ramanarayana Reddy Kotamreddy Sridhar Reddy Mekapati Chandrasekhar Reddy YSRCP Nellore District