Balakrishna: సీటు రాదని తెలిసినా నాన్న కోరిక మేరకు మెడికల్ ఎంట్రన్స్ రాశాను: బాలకృష్ణ

  • బసవతారకం ఆసుపత్రిలో 23వ వార్షికోత్సవ వేడుకలు
  • హాజరైన బాలకృష్ణ, శ్రీలీల, పీవీ సింధు
  • కొత్త పరికరాలు ప్రారంభించిన బాలకృష్ణ
Balakrishna and his medical entrance

తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సకు, సేవాభావానికి చిరునామాగా నిలుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, యువ హీరోయిన్ శ్రీలీల, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

వార్షికోత్సవం నేపథ్యంలో, బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రిలో కొత్త పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం అని పేర్కొన్నారు. మా అమ్మ బసవతారకం కోరిక మేరకు ఆసుపత్రి ఏర్పాటు చేశారని వెల్లడించారు. 

ఆసుపత్రి కోసం కొన్ని కొత్త పరికరాలు తీసుకువచ్చామని తెలిపారు. బసవతారకం ఆసుపత్రి దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా నిలిచిందని బాలకృష్ణ సగర్వంగా చెప్పారు. తమకు సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. 

తనను వైద్యుడిగా చూడాలని తన తండ్రి ఎన్టీఆర్ కోరుకున్నారని, దాంతో మెడికల్ ఎంట్రన్స్ కూడా రాశానని బాలయ్య వెల్లడించారు. సీటు రాదని తెలిసినా నాన్న మాట కాదనలేక రాశానని వివరించారు. తనకు క్రీడలంటేనే ఎక్కువ ఆసక్తి అని తెలిపారు. వైద్యుడ్ని కాకపోయినా బసవతారకం ఆసుపత్రికి చైర్మన్ ను అయ్యానని చమత్కరించారు. అయితే తాను ఎదుటి వ్యక్తిని చూడగానే అతడు మనసు చదివేస్తానని, తాను కూడా సైకియాట్రిస్ట్ నే అని సరదాగా అన్నారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News