Shuttlers: ఒక్క దెబ్బకు ప్రపంచ మూడో ర్యాంక్ కు దూసుకెళ్లిన సాత్విక్- చిరాగ్

  • కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంక్‌ అందుకున్న భారత టాప్‌ షట్లర్లు
  • ఇండోనేసియా టైటిల్ తో మూడు స్థానాలు మెరుగుదల
  • కిదాంబి శ్రీకాంత్ ర్యాంక్ కూడా మెరుగు
Shuttlers Satwik and Chirag rise to career high world No3

ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నమెంట్‌లో టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్‌ స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి తమ ర్యాంక్‌లోనూ దూసుకెళ్లారు. ఆదివారం ఆ మెగా టోర్నీ టైటిల్‌ నెగ్గడంతో వారి ర్యాంక్ పెరిగింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజా జాబితాలో పురుషుల డబుల్స్ విభాగంతో ఈ ఇద్దరూ ఆరో ర్యాంక్‌ నుంచి మూడో ర్యాంక్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ లో మరో తెలుగు ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ మూడు స్థానాలు మెరుగయ్యాడు. 22 నుంచి 19వ ర్యాంక్‌ కు చేరుకున్నాడు. యువ షట్లర్ లక్ష్యసేన్‌ రెండు స్థానాలు పెరిగి 20 నుంచి 18వ ర్యాంక్‌ అందుకున్నాడు.

హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ భారత్ నుంచి పురుషుల సింగిల్స్ లో అత్యధిక ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. ప్రణయ్ తన తొమ్మిదో ర్యాంక్‌ నిలబెట్టుకున్నాడు. మహిళల సింగిల్స్ లో మాత్రం తెలుగు షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ర్యాంకులు కిందకు పడ్డాయి. పీవీ సింధు 12వ స్థానానికి పడిపోగా.. సైనా నెహ్వాల్‌ 31వ ర్యాంక్‌లో నిలిచింది. మహిళల డబుల్స్‌ లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జంట 16వ స్థానంలో మార్పు లేదు. మిక్స్‌ డ్‌ డబుల్స్ విభాగంలో సిక్కిరెడ్డి–రోహన్‌ కపూర్‌ జంట 33వ ర్యాంక్‌లో నిలిచింది.

More Telugu News