dastagiri: బాలుడిని నిర్బంధించిన దస్తగిరి.. పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు!

  • ఇచ్చిన అప్పు చెల్లించలేదని బాధితుల కొడుకును నిర్బంధిచిన దస్తగిరి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కుళ్లాయమ్మ
  • దస్తగిరి ఇంట్లో నిర్బంధించిన బాలుడిని విడిపించిన ఎస్సై
dastagiri kidnapped a boy in pulivendula

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరిపై కేసు నమోదైంది. కుళ్లాయమ్మ అనే మహిళ పులివెందుల పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు పెట్టింది. తన కుమారుడు గూగుడువల్లీని నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, అతడిని కాపాడాలని కోరింది. దీంతో ఎస్‌ఐ హుస్సేన్‌ తన సిబ్బందితో కలిసి వెళ్లి.. దస్తగిరి ఇంట్లో నిర్బంధించిన బాలుడిని విడిపించారు.

తర్వాత పులివెందులలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బాలుడికి వైద్యం చేయించారు. బాలుడిని నిర్బంధించిన విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు, వైసీపీ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. చికిత్స అందించిన తర్వాత బాలుడిని స్టేషన్‌కు తీసుకెళ్తుండగా.. పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

బాధితుడి తల్లి కుళ్లాయమ్మ మాట్లాడుతూ.. కుటుంబ అవసరాల కోసం తన భర్త పెద్దగూగుడువల్లీ, తాను కలిసి ఆరు నెలల కిందట దస్తగిరి వద్ద వడ్డీకి రూ.40 వేలు అప్పు తీసుకున్నామని చెప్పింది. వారం వారం వడ్డీ చెల్లిస్తూ వస్తున్నామని, పది రోజుల నుంచి డబ్బులు సక్రమంగా కట్టకపోవడంతో తమ కొడుకు గూగుడువల్లీని సోమవారం మధ్యాహ్నం సమయంలో దస్తగిరి ఎత్తుకెళ్లి నిర్బంధించాడని వాపోయింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడని చెప్పింది. 

బాలుడి తల్లి కుళ్లాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై హుస్సేన్‌ వెల్లడించారు. దస్తగిరిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని దస్తగిరి, అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు.

More Telugu News