Andhra Pradesh: మొండికేస్తున్న నైరుతి.. నిప్పుల కొలిమిలా ఏపీ

  • నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఏపీ
  • వాయుగుండం బలహీనపడే వరకు రుతుపవనాలు బలపడే అవకాశం లేదంటున్న నిపుణులు
  • నెల్లిమర్లలో నిన్న 46 డిగ్రీలు
Southwest Monsoon delaying in Andhra Pradesh

నైరుతి రుతుపవనాలు మొండికేస్తున్నాయి. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలను నిరాశకు గురిచేస్తున్నాయి. ఫలితంగా జూన్‌లో సగం రోజులు గడిచిపోయినా ఎండలు సుర్రుమంటున్నాయి. భానుడు రెచ్చిపోయి నిప్పులు కురిపిస్తుండడంతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. మరో రెండు మూడు రోజుల్లో వాటిలో కదలిక కనిపించే అవకాశం ఉందని పేర్కొంది.

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజస్థాన్‌లో కొనసాగుతున్న వాయుగుండం పూర్తిగా బలహీనపడేవరకు దక్షిణాదిలో రుతుపవనాలు బలపడే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. 25 నాటికి వాయవ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడి ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉందని, అప్పుడు ఉత్తర కోస్తాకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, నిన్న విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

More Telugu News